ఇరికించారు, వెనక కులపిచ్చి ఆఫీసర్లు: మాయావతి
న్యూఢిల్లీ: జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ (ఎన్ఆర్ హెచ్ఎం) కుంభకోణంలో అనవసరంగా తన మీద దర్యాప్తు చేయిస్తున్నారని, అయినా తాను భయపడనని బీఎస్పీ చీఫ్, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మాయావతి అన్నారు.
కేంద్ర ప్రభుత్వం కావాలనే ఈ కుంభకోణంలో తన మీద దర్యాప్తు చేయించడానికి సిద్దం అయ్యిందని ఆరోపించారు. ఢిల్లీలో ఆమె విలేకరులతో మాట్లాడారు. తన మీద రాజకీయ కక్ష సాధించడానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని అన్నారు.
ఈ కక్ష సాధింసడానికి సీబీఐని దుర్వినియోగం చేస్తోందని ఆరోపించారు. ఉత్తరప్రదేశ్ లో నాలుగు సంవత్సరాల కిందట జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ స్కాం వెలుగు చూసింది. ఈ స్కాంతో తనకు ఎలాంటి సంబంధం లేదని, అయినా సీబీఐతో దర్యాప్తు చేయించుకోవచ్చని మాయావతి సవాలు విసిరారు.
ఒత్తిళ్లకు తానెప్పుడూ తలోగ్గబోనని మాయావతి స్పష్టం చేశారు. ఈ స్కాంలో తనను ప్రశ్నించాలని తీసుకున్న నిర్ణయం వెనుక దళితులు, వెనుకబడిన వర్గాలను చులకనగా చూసే కులపిచ్చి ఉన్న కొందరు సీబీఐ అధికారుల హస్తం ఉంటుందని ఆమె అనుమానం వ్యక్తం చేశారు.
అయితే మాయావతి చేస్తున్న ఆరోపణలలో ఎలాంటి నిజం లేదని కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ అన్నారు. సీబీఐ ఆధారాల ప్రాతిపాదికనే దర్యాప్తు చేస్తున్నదని, ఇందులో రాజకీయ కక్షలు ఎందుకు ఉంటాయని ఆయన ప్రశ్నించారు.