అగ్గి బరాటా: సువేందు సర్కార్ పై ఎదురుదాడి: జూన్ 2న
తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రోడ్డెక్కనున్నారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత మొదటిసారిగా వీధుల్లోకి రానున్నారు. జూన్ 2న బెంగాల్ ఆందోళనకు పిలుపునిచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలను నిర్వహించనున్నారు. కోల్ కతాలో నిర్వహించబోయే ఆందోళనలకు ఆమె స్వయంగా నాయకత్వం వహించనున్నారు. రోజంతా నిరసన ప్రదర్శనలను చేపట్టనున్నారు.
ఈ ఆందోళనలకు ఇంకా పోలీసుల నుంచి అనుమతి లభించలేదు. ఒకవేళ అనుమతి లభిస్తే రాణి రాస్మణి అవెన్యూలో నిరసన ప్రదర్శనలో పాల్గొంటారు మమత బెనర్జీ. రాష్ట్రంలో ఎన్నికల అనంతరం చెలరేగిన హింసాత్మక పరిస్థితులకు వ్యతిరేకంగా తృణమూల్ ఈ ధర్నాకు పిలుపునిచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాలు, నియోజకవర్గాల్లో ఈ ధర్నాలు ఉంటాయని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఉదయం 10 గంటలకు ధర్నాలు ప్రారంభమవుతాయి.

అదే రోజు మధ్యాహ్నం మమత బెనర్జీ ఇందులో పాల్గొంటారు. ఈ నిరసన రోజంతా కొనసాగుతుందని, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర సీనియర్ నాయకులు ఇందులో పాల్గొంటారని టీఎంసీ పేర్కొంది. ఎన్నికల ఫలితాలు వెలువడినప్పటి నుండి ఓట్ల అక్రమాలు, ఎన్నికల అనంతర హింస ఆరోపణలపై మమత బెనర్జీ అనేకసార్లు గళమెత్తారు. వీడియో సందేశాల ద్వారా పశ్చిమ బెంగాల్ ప్రభుత్వంపై తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఇప్పుడు ఇదే అంశాలపై వీధుల్లోకి వచ్చి నిరసన తెలపాలని నిర్ణయించారు.
మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ భారీ పరాభవం ఎదురైన విషయం తెలిసిందే. 294 నియోజకవర్గాలు ఉన్న అసెంబ్లీలో 80 సీట్లతో సరిపెట్టుకోవలసి వచ్చింది. ఈ ఎన్నికల్లో బీజేపీ భారీ మెజారిటీతో విజయం సాధించి, ప్రభుత్వ ఏర్పాటు చేసింది. ఇటీవల జరిగిన ఫాల్తా ఉప ఎన్నికలో కూడా బీజేపీ భారీ మెజారిటీతో గెలుపొందింది. ఫాల్తా ఫలితాల తర్వాత మమత ఫేస్బుక్ లైవ్లో అనేక ఆరోపణలు చేశారు. తన పార్టీ ప్రజల తీర్పుతో ఓడిపోలేదని వాదించారు.
తమకు 220 నుంచి 230 సీట్లు రావాల్సి ఉన్నప్పటికీ.. వాటిని తారుమారు చేశారనేది మమత బెనర్జీ వాదన. ఈ ఎన్నికల ప్రక్రియపై సందేహాలు వ్యక్తం చేశారామె. పార్టీ ఏజెంట్లను భయపెట్టి పోలింగ్ కేంద్రాల నుంచి బయటకు పంపించారని, ఫలితంగా గెలిచే స్థానాలను కోల్పోయామని అన్నారు. 150 సీట్లలో బీజేపీ బూత్ క్యాప్చరింగ్ కు పాల్పడిందని ఆరోపించారు. ప్రజాభిప్రాయం ప్రకారం ఏర్పడిన ప్రభుత్వం కాదని మండిపడ్డారు. ఓట్లను దోచుకున్నారని, తమ పార్టీ కార్యాలయాలను ధ్వంసం చేశారని, 2,000 మంది టీఎంసీ కార్యకర్తలను అక్రమంగా అరెస్ట్ చేశారని ధ్వజమెత్తారు.












Click it and Unblock the Notifications