బందరు టెక్కీ హత్య: పోలీసుల అదుపులో నలుగురు
ముంబై: ఇటీవల మహారాష్ట్రలోని ముంబైలో దారుణ హత్యకు గురైన ఆంధ్రప్రదేశ్లోని మచిలీపట్నంకు చెందిన మహిళా సాఫ్ట్వేర్ అనూహ్య కేసులో నగర పోలీసులు పురోగతి సాధించారు. అనూహ్య కేసుకు సంబంధించి అనుమానితులుగా భావిస్తున్న నలుగురు ఆటో డ్రైవర్లను శనివారం ముంబై పోలీసులు అదులోకి తీసుకున్నారు. వారిని పోలీస్ స్టేషన్కు తరలించి విచారిస్తున్నారు. బాధితురాలు అత్యాచారానికి గురైనట్లు తాము భావిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అయితే ఇంతవరకు నిర్ధారించలేదని చెప్పారు.

ముంబైలోని టిసిఎస్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పని చేస్తున్న అనూహ్య, జనవరి 16న నగర సరిహద్దులో శవమై కనిపించిన విషయం తెలిసిందే. క్రిస్మస్ సెలువుల నేపథ్యంలో ఆమె తన స్వస్థలానికి డిసెంబర్ నెలలో వచ్చింది. వేడుకల అనంతరం జనవరి మొదటి వారంలో ముంబై పయనమైంది. ఆ క్రమంలో అనూహ్య ఆచూకీ తెలియకపోవడంతో ఆందోళనకు గురైన ఆమె తండ్రి శింగవరపు ప్రసాద్ ముంబై పోలీసులను ఆశ్రయించారు.
ముంబై పోలీసుల నుంచి సరైన స్పందన రాకపోవడంతో.. బంధువులతో కలిసి శింగవరపు ప్రసాద్ తన కూతురు కోసం తీవ్రంగా గాలించారు. కుంజుర్మార్గ్ ప్రాంతంలో కొంతమేర కాలిపోయి ఉన్న మృతదేహాన్ని అనూహ్యగా గుర్తించారు. శుక్రవారం కేంద్ర హోంశాఖ మంత్రి సుశీల్ కుమార్ షిండేను న్యూఢిల్లీలో కలిసిన అనూహ్య తండ్రి శింగవరపు ప్రసాద్, ఆమె మరణంపై ముంబై పోలీసులు ఎలాంటి చర్యలు చేపట్టడం లేదని తెలిపారు.
దీంతో అనూహ్య కేసులో దర్యాప్తును వేగవంతం చేయాలని మహారాష్ట్ర ప్రభుత్వానికి సుశీల్ కుమార్ షిండే ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర సిఎం ఆదేశాల మేరకు ముంబై పోలీసులు అనూహ్య హత్య కేసులో దర్యాప్తును వేగవంతం చేశారు. ఈ క్రమంలోనే నలుగురు అనుమానితులను శనివారం అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.












Click it and Unblock the Notifications