పెళ్లిలో టిక్టాక్ వీడియో: రెండు గ్రూపుల మధ్య గొడవ, గ్యాంబ్లింగ్ డెన్లో కాల్పులు
న్యూఢిల్లీ: వినోదపు వీడియో యాప్ 'టిక్టాక్' వీడియో రెండు గ్రూపుల మధ్య గొడవ పెట్టింది. ఓ గ్రూపులోని నలుగురు సభ్యులు మరో గ్రూపుపై కాల్పులకు తెగబడ్డారు. దీంతో నలుగురికి బుల్లెట్ గాయాలయ్యాయి. ఈ ఘటన న్యూఢిల్లీలోని అగర్నగర్లోని సోమ్ విహార్లో చోటు చేసుకుంది.

పెళ్లిలో టిక్టాక్ వీడియో..
సోమవారం రాత్రి 10.15గంటలకు తమకు ఈ ఘటనపై సమాచారం అందిందని పోలీసులు తెలిపారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రులకు తరలించామని రోహిణి డీసీపీ ఎస్డీ మిశ్రా తెలిపారు. నవంబర్ 29న రెండు గ్రూపులు ఓ వివాహానికి హాజరయ్యాయి. అక్కడ టిక్టాక్ వీడియో తీస్తుండటంతో బాధితులు అడ్డుకున్నారు. దీంతో నిందితులు బాధితులతో గొడవపడ్డారు.

మరుసటి రోజు చితకబాదారు.. తల్లితో దుర్భాషలు
ఆ తర్వాతి రోజు నిందితులు బాధితులలో ఒకడిపై దాడి చేసి తీవ్రంగా కొట్టారు. ఆ తర్వాత కొద్ది రోజులకు బాధితుడు వారిపై ప్రతీకారం తీర్చుకునేందుకు దాడి చేసిన ఘటనా స్థలానికి వెళ్లాడు. అక్కడ నిందితులెవరూ కనిపించలేదు. అయితే, నిందితుడి తల్లి కనిపించడంతో ఆమెను దుర్భాషలాడాడు బాధితుడు.

గదికి వెళ్లి కాల్పులు..
ఆ తర్వాత నిందితుడు వచ్చి బాధితుడిని చంపుతామంటూ బెదిరింపులకు గురిచేశారు.
ఈ క్రమంలోనే సోమవారం రాత్రి ముగ్గురు నిందితులు.. బాధితులుండే గదికి వెళ్లి కాల్పులు జరిపారు. ఆ తర్వాత అక్కడ్నుంచి పరారయ్యారు. నిందితులు 8 రౌండ్లపాటు కాల్పులు జరిపారని పోలీసులు తెలిపారు. సోమవారం రాత్రి 10గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. కాల్పుల్లో గాయపడిన వారిలో రవి శర్మ(25), రాజేందర్(46), హిమాన్షు పాల్(23), సంజీవ్ కుమార్(21)అనే వ్యక్తులు ఉన్నారని సీనియర్ పోలీసు అధికారి ఒకరు చెప్పారు.

అదో గ్యాంబ్లింగ్ డెన్..
నిందితులపై సెక్షన్ 307, 34ల కింద కేసు నమోదు చేశామని చెప్పారు. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలింపు చేపట్టినట్లు డీసీపీ మిశ్రా తెలిపారు. కాగా, కాల్పులు జరిగిన ప్రదేశం ఓ గ్యాంబ్లింగ్ డెన్ అని డీసీపీ తెలిపారు. అక్కడి గ్యాంబ్లింగ్ రాకెట్పై నవంబర్ 22న కేసు నమోదు చేశామని, శివమ్ అనే నిందితుడిని అరెస్ట్ చేసినట్లు ఆయన తెలిపారు.












Click it and Unblock the Notifications