జీఎస్టీ రేట్లు ఖరారు: 'సామాన్య' వస్తువుల నుంచి కూల్ డ్రింక్స్ దాకా ఇలా..
న్యూఢిల్లీ: పార్లమెంటు శీతాకాల సమావేశాలకు పదిహేను రోజుల సమయం ఉంది. ఈ నేపథ్యంలో జీఎస్టీకి సంబంధించిన పన్ను రేటు, సెస్ల విధింపు వంటి కీలక విషయాలను చర్చించేందుకు గురువారం నాడు జీఎస్టీ కౌన్సెల్ భేటీ అయింది.
జీఎస్టీ కౌన్సెల్ భేటీ కావడం ఇది రెండోసారి. ఈ భేటీ కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ నేతృత్వంలో జరిగింది. ఈ భేటీలో నాలుగెంచేల పన్ను విధానానికి పచ్చజెండా ఊపారు. 5 శాతం, 12 శాతం, 18 శాతం, 28 శాతంగా రేటు స్ట్రక్చర్ని ఫైనలైజ్ చేసింది.
షెడ్యూల్ ప్రకారమే జీఎస్టీ (గుడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్) అమలులోకి వస్తుందని అరుణ్ జైట్లీ భేటీ అనంతరం పేర్కొన్నారు. సమావేశంలో పన్ను రేట్ల విధానం, పరిహారంపై సుదీర్ఘంగా చర్చించామన్నారు. జీఎస్టీ పన్ను రేటును 5, 12, 18, 28 శాతాలుగా (4 భాగాలుగా) నిర్ణయించినట్లు చెప్పారు.
ఆహారధాన్యాలపై సాధారణ ప్రజలకు పన్ను మినహాయింపు ఇవ్వనున్నట్లు తెలిపారు. సామాన్యులు వినియోగించే వస్తువులపై 5 శాతం పన్ను రేటును నిర్ణయించినట్లు పేర్కొన్నారు. కూల్డ్రింక్స్, పాన్ మసాలా, లగ్జరీ కార్లు, పొగాకు ఉత్పత్తులపై 28 శాతానికిపైగా పన్ను విధించనున్నట్లు తెలిపారు.