ఢిల్లీ నుంచి రాజ్భవన్ దాకా: మహారాష్ట్రలో ఏమి జరిగింది..మినిట్ టూ మినిట్ అపడేట్స్
ముంబై/ ఢిల్లీ: మహారాష్ట్ర రాజకీయ ముఖచిత్రం ఒక్కరాత్రిలోనే మారింది. శుక్రవారం సాయంత్రం వరకు ఎన్సీపీ శివసేన కాంగ్రెస్ పార్టీల మధ్య జరిగిన చర్చల తర్వాత ముఖ్యమంత్రి అభ్యర్థిగా శివసేన నుంచి ఆ పార్టీ అధినేత ఉద్ధవ్ థాక్రే ఉంటారని శరద్ పవార్ ప్రకటించారు. అంతే ఆ ప్రకటన తర్వాత అంతా సర్దుకున్నారు. అర్థరాత్రి నుంచి మళ్లీ బీజేపీ మంతనాలు ప్రారంభించింది. ఉద్ధవ్ థాక్రే ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని శనివారం భగత్సింగ్ కోష్యారీని కలిసి చెప్పాల్సి ఉండగా.. అంతలోనే ఒక్క రాత్రిలోనే మాయ జరిగిపోయింది. ఢిల్లీ టూ మహారాష్ట్ర రాజ్భవన్ వరకు అర్థరాత్రి నుంచి తెల్లవారు జాము వరకు ఎలాంటి నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి మినిట్ టూ మినిట్ ఏమి జరిగింది..?
ఫడ్నవీస్కు పట్టాభిషేకం: కిచిడీ సర్కార్ కాదు.. సుస్థిర ప్రభుత్వం కావాలి: దేవేంద్ర ఫడ్నవీస్
ఉదయం రాష్ట్రపతి పాలన ఎత్తివేత
మహారాష్ట్ర రాజకీయాల్లో మహా మలుపులు చోటుచేసుకున్నాయి. హైడ్రామా మధ్య సీఎంగా ఫడ్నవీస్, ఉపముఖ్యమంత్రిగా అజిత్ పవార్లు ప్రమాణస్వీకారం చేశారు. ఇందుకు వేదికగా నిలిచింది మహారాష్ట్ర రాజ్భవన్. ఢిల్లీ నుంచి రాజ్భవన్ వరకు అన్ని ఆదేశాలు క్షణాల్లో చేరిపోయాయి. ముందుగా మహారాష్ట్రలో ఉన్న రాష్ట్రపతి పాలనను ఎత్తివేస్తూ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ శనివారం తెల్లవారుజామున 5గంటల 47 నిమిషాలకు నోటిఫికేషన్ జారీ చేశారు.
బీజేపీ -ఎన్సీపీ సర్కార్ ఏర్పాటుకు గవర్నర్ ఆహ్వానం
ఇక ఆ తర్వాత కేంద్ర హోంమంత్రిత్వ శాఖ కార్యదర్శి అజయ్ కుమార్ భల్లా రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ పేరిట మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన ఎత్తివేస్తున్నట్లు గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. రాష్ట్రపతి పాలన ఎత్తివేసిన వెంటనే మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ బీజేపీ-ఎన్సీపీలను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించారు. ఇక్కడే రాజ్భవన్ వేదికగా ఇంట్రెస్టింగ్ పరిణామాలు చోటుచేసుకున్నాయి.
ఉదయం 8:15 గంటలకు సీఎంగా ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం
శనివారం రాష్ట్రపతి పాలన ముగిసిన మూడు గంటల్లోపే మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్, ఉపముఖ్యమంత్రిగా అజిత్ పవార్లచే గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ ఉదయం 8:15 గంటలకు ప్రమాణస్వీకారం చేయించారు. రాజ్భవన్ వేదికగా జరిగిన ఈ హైడ్రామా అందరికీ షాక్ ఇచ్చింది. శనివారం కావడం చాలా ఆఫీసులకు సెలవు దినం ఉండటం , అప్పుడే నిద్రలేచిన వారు ముందుగా పేపర్ చదవగా ఉద్ధవ్ థాక్రేనే ముఖ్యమంత్రి అని పతాకశీర్షికలో రావడం జరిగాయి. కానీ ఎప్పుడైతే టీవీలు పెట్టారో మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ అని చూశాకా ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. వార్త చూశాకా పాలిటిక్స్ను దగ్గరగా ఫాలో అయ్యేవారికి నిద్రమత్తు ఒక్కసారిగా వదిలింది.