యోధుడే.. అనివార్యమైన ఓటమి.. ‘మాణిక్’పై కమలం గెలుపు ఇలా
అగర్తల: 1998 నుంచి ఇప్పటి వరకు లెఫ్ట్ ఫ్రంట్కు పెట్టని కోటగా ఉన్న త్రిపురలో అద్భుత విజయం నిజంగా బీజేపీకి పట్టరాని సంతోషమే. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి ఓ చిన్నరాష్ట్రంలో గెలిస్తే ఎందుకింత సంబురం? విజయం ఎవరికైనా ఆనందాన్నిస్తుంది.. అయితే బీజేపీ ఇక్కడ సాధించింది మాత్రం గెలుపు కంటే ఎక్కువే.
మచ్చలేని ప్రతిష్ఠతో.. రెండు దశాబ్దాలుగా అప్రతిహతంగా పాలన సాగిస్తున్న మాణిక్ సర్కార్ లాంటి వ్యక్తిని ఢీకొట్టి ఆ పార్టీ అద్భుతం సాధించింది మరి.. ఇదే బీజేపీకి అదనపు బలాన్ని.. రెట్టించిన ఉత్సాహాన్ని కలిగిస్తోంది. మాణిక్ సర్కార్కు మచ్చల్లేవు.. మరకల్లేవు.. వ్యక్తిగతంగా విమర్శించడానికీ ఏమీలేవు.

విజయవంతమైన మోదీ, అమిత్ షా చతురత
ఈ నేపథ్యంలో ఎన్నికల బరిలోకి దిగిన కమలనాథులు.. ప్రత్యేకించి ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా చేసిన ‘అభివృద్ధి-మార్పు' నినాదం, ప్రచారం త్రిపుర ప్రజలను ముగ్ధుల్ని చేసి తిరుగులేని ఫలితాన్ని అందించింది. ఆర్భాటాలు, ఆస్తులకు దూరంగా బతికిన ప్రజానేతగా.. అతిపేద సీఎంగా ప్రాభవం కలిగిన మాణిక్ సర్కార్ను ఎదుర్కొనే వ్యూహాల్లో ప్రధాని మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా చతురత ప్రదర్శించారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.

ఉద్యోగాలపై నిరుద్యోగుల ఆవేదన ఇలా
ఎనిమిది జిల్లాల పరిధిలో 37 లక్షల జనాభా గల చిన్న రాష్ట్రం త్రిపురలో - ఎన్నికల ప్రచారానికి దాదాపు 15 రోజుల పాటు మాణిక్ సర్కార్ 35 సార్లు పర్యటించారంటే ఆయన ఏ స్థాయిలో శ్రమించారో అవగతమవుతోంది. ఆయనపైన.. ఆయన ప్రతిష్ఠపైనే సీపీఎం భారీగా ఆశలు పెట్టుకుంది. దీంతో మాణిక్ సర్కార్ లక్ష్యంగా బీజేపీ ప్రచార హోరు సాగించింది. మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రజల్లోనూ అసంతృప్తి పెరుగుతూ వచ్చింది. రాష్ట్రంలో మాణిక్ సర్కార్ శాంతిని నెలకొల్పగలిగినా ప్రజల ఆకాంక్షలు అంతకు మించి ఉన్నాయి.

వేతనాల పెంపుపై ఉద్యోగుల ఆవేదన ఇలా
మాణిక్ సర్కార్కు గల ప్రతిష్ఠ, ఆర్థిక నిరాడంబరతలకు మించి రాష్ట్రంలో మార్పునకు ఇది సమయమని వారంతా విశ్వసించారు. తమకు ఉద్యోగాలు రావడం లేదని.. ఆధునికతకు దూరమవుతున్నామని.. ప్రభుత్వంపై రాష్ట్ర యువత నిరాశానిస్పృహల్లో ఉంది. దీనికితోడు జీతాలు పెరగడం లేదన్న ఉద్యోగుల ఆవేదన, ఉద్యోగాల కుంభకోణం ఆరోపణలు, పార్టీకి-ప్రభుత్వానికి మధ్య అస్పష్టత వంటి అంశాలను అస్త్రాలుగా చేసుకున్న బీజేపీ అగ్రనేతలు రాష్ట్రాన్ని అభివృద్ధి బాట పట్టిస్తామని ప్రజలను మెప్పించగలిగారు.

కేవలం 0.3 శాతం ఓట్లతో జాతకాలు తారుమారు
వ్యక్తిగా మాణిక్ సర్కార్ నిజాయితీపరుడైనా.. ఆయన ప్రభుత్వం కళంకితమైందని ఒప్పించగలిగారు. ‘మార్పు తీసుకొద్దాం రండి (పల్టాహై)' అంటూ తమవైపు తిప్పుకోగలిగారు. దీంతో ప్రజలు మార్పును కోరుకున్నారు. ఆ మార్పు మోదీ, బీజేపీలతోనే సాధ్యమని విశ్వసించారు. 35 స్థానాల్లో విజయం సాధించిన బీజేపీ 43 శాతం ఓట్లు పొందితే, ఎనిమిది స్థానాల్లో గెలుపొందిన దాని మిత్రపక్షం ఇండిజీనియస్ పీపుల్స్ ఫ్రంట్ ఆఫ్ త్రిపుర (ఐపీఎఫ్టీ) మరో 7.5 శాతం ఓట్లు పొందింది. 42.7 శాతం ఓట్లను పొందినా సీపీఎం కేవలం 16 సీట్లకే పరిమితమైంది.

రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణకు అవిరామ క్రుషి
దేశ వామపక్షాల చరిత్రలో మాణిక్ సర్కార్ది చెరిగిపోని ముద్ర. సాధారణ ప్రజల శాంతిభద్రతలు, జాతీయ భద్రత, అందరికీ తగిన గుర్తింపు.. ఇవన్నీ ముఖ్యమని నమ్మిన నేత. ఆర్థిక అంశాలతో పాటు సంస్కృతి కూడా ప్రధానమేనని విశ్వసించిన వ్యక్తి. 1998లో సీఎంగా ఆయన బాధ్యతలు చేపట్టేనాటికి బెంగాలీలు, గిరిజన తెగల మధ్య కల్లోలం నెలకొంది. బంగ్లాదేశ్ నుంచి తిరుగుబాటుదారులు రాష్ట్రంలో తరచూ హింసను ప్రేరేపిస్తున్న తరుణమది.. అలాంటి విద్రోహచర్యలను ఆయన సమర్ధంగా అణగదొక్కగలిగారు. గిరిజన ప్రాంతాల్లోనూ సీపీఎంను విస్తరించారు. సమాజ ప్రమాణాలను పెంచగలిగారు. తన బెంగాలీ గుర్తింపు కూడా పని చేసింది.

అంచనాలు తలకిందులు చేసిన త్రిపుర వాసులు
ఎన్నికల ప్రకటనకు ముందు జనవరి ప్రారంభంలో రాష్ట్రంలో పర్యటిస్తున్నప్పుడు మాణిక్ సర్కార్ స్పందిస్తూ ప్రజల దగ్గరకు వెళ్లి అడిగితే వారే జవాబు చెబుతారన్న మాణిక్ సర్కార్.. గత నెల ఎన్నికల ప్రచారం ముగిసేనాటికి బీజేపీ - సీపీఎం మధ్యే ప్రధాన పోటీ అని పేర్కొనడంతోనే వాస్తవ పరిస్థితి అవగతం అవుతుంది. కొందరు రాజకీయ పండితులకు అంతుబట్టకున్నా మొత్తంగా త్రిపుర ప్రజలు మాణిక్ సర్కార్ అంచనాలను తల్లకిందులు చేశారు. త్రిపుర సీఎంగాగా వరుసగా 20 ఏళ్లు కొనసాగి పదవి నుంచి వైదొలుగుతున్న మార్క్సిస్ట్ నేత మాణిక్ సర్కార్ రెండు విషయాల్లో చరిత్రకెక్కారు. దేశంలో ‘అతి పేద' సీఎం మాణిక్ అని ఆయన ఎన్నికల అఫిడవిట్ వెల్లడించింది.

ముత్తాత ఇంట్లో మాణిక్ సర్కార్ నివాసం
పశ్చిమ బెంగాల్ సీఎంగా 34 ఏళ్లకు పైగా పనిచేసిన జ్యోతి బసు తర్వాత రెండు దశాబ్దాలు ఈ పదవి నిర్వహించిన సీపీఎం నేతగా మాణిక్దే రికార్డు. 49 ఏళ్ల వయసులో ఆయన 1998లో సీఎం పదవి చేపట్టారు. 1960వ దశకం చివరిలో త్రిపురలోని కాంగ్రెస్ సర్కార్కు వ్యతిరేకంగా విద్యార్థిగానే ఉద్యమించి కమ్యూనిస్ట్ పార్టీలో చేరారు. ప్రజా పోరాటాలకే అంకితమై సీపీఎం విస్తరణకు కృషి చేసిన ఫలితంగా 1972లో 23 ఏళ్లకే త్రిపుర సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడయ్యారు. 49 ఏళ్లకే సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడయ్యాక సర్కార్కే సీఎం పదవి దక్కింది. సొంత ఇల్లు లేని ఆయన తన ముత్తాతకు చెందిన అతి చిన్న ఇంట్లోనే సీఎంగా నివసిస్తూ వచ్చారు. సొంత కారు లేకపోవడమేగాక, సీఎంగా తనకు వచ్చే జీతం మొత్తాన్ని పార్టీకే ఇచ్చి, పార్టీ నెలనెలా అందించే రూ.5000తోనే సరిపెట్టుకుంటున్నారు.

భార్య ఫించన్తోనే అవసరాలు తీరిపోతాయన్న మాణిక్ సర్కార్
సెంట్రల్ సోషల్ వెల్ఫేర్ బోర్డు ఉద్యోగిగా 2011లో పదవీ విరమణ చేసిన ఆయన భార్య పాంచాలీ భట్టాచార్య భర్త మాదిరే నిరాడంబర జీవితం గడపుతున్నారు. సీఎం భార్య అయినా ఎలాంటి భద్రత లేకుండా రాజధాని అగర్తలలో ఆమె రిక్షాలో ప్రయాణించడం నగర వాసులందరికీ తెలిసిన సంగతే. ఆయన సీఎం అయ్యాక కూడా నగరంలో ఉదయం నడకకు మాణిక్ బయల్దేరడంతో భద్రతా సిబ్బంది పాంచాలికి విషయం చెప్పగానే ఆమె భర్త కోసం ట్రెడ్మిల్ కొని ఇంటికి తెచ్చారు. ఒక ఇంటర్వ్యూలో మాణిక్ సర్కార్ మాట్లాడుతూ తన కళ్లజోడు ఖరీదు రూ.1800, చెప్పులు చాలా చౌక అని, నీటుగా కనిపిస్తే విలాస వస్తువులు వాడతానని అనుకోవద్దని వ్యాఖ్యానించారు. తనకు ఒక చార్మినార్ సిగరెట్ ప్యాకెట్, చిన్న ప్యాకెట్ నస్యం ఉంటే చాలనీ, రూ.5000కు తోడు తన భార్య పించన్తో అవసరాలు తీరిపోతున్నాయన్నారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications