జులై 1 నుంచి బిగ్ ఛేంజ్.. ఇక ఏడాదికి 125 రోజుల పని!
దేశ గ్రామీణ ప్రాంతాల ముఖచిత్రాన్ని మార్చే దిశగా కేంద్ర ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. దశాబ్దాలుగా అమలులో ఉన్న మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (MGNREGA) స్థానంలో, మరింత శక్తివంతమైన 'విక్షిత్ భారత్ - గ్యారెంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవిక మిషన్ (గ్రామీణ్)' [VB-G RAM G] లేదా సంక్షిప్తంగా 'జీరామ్ జీ' (G RAM G) చట్టాన్ని జులై 1, 2026 నుంచి దేశవ్యాప్తంగా అమలు చేయనున్నట్లు కేంద్రం నోటిఫికేషన్ విడుదల చేసింది.
ప్రస్తుతం ఉన్న ఉపాధి హామీ పథకంలో పని దినాల సంఖ్యపై ఉన్న పరిమితులను సవరిస్తూ, నూతన 'జీరామ్ జీ' చట్టం కింద ప్రతి గ్రామీణ కుటుంబానికి ఒక ఆర్థిక సంవత్సరంలో కనీసం 125 రోజుల వేతన ఉపాధిని చట్టబద్ధమైన గ్యారెంటీగా కల్పించనున్నారు. అన్-స్కిల్డ్ శారీరక శ్రమ చేయడానికి సిద్ధంగా ఉన్న గ్రామీణ వయోజనులందరికీ ఈ పథకం వర్తిస్తుంది.

సకాలంలో వేతనాలు.. నిరుద్యోగ భృతి
ఈ నూతన చట్టం పారదర్శకతకు వేతనాల చెల్లింపునకు పెద్దపీట వేసింది. కూలీలకు చేసిన పనికి గానూ వారం లేదా 15 రోజుల వ్యవధిలోనే వేతనాలను నేరుగా అందజేస్తారు. పని కోరిన వెంటనే నిర్ణీత గడువులోగా ఉపాధి కల్పించాల్సి ఉంటుంది. ఒకవేళ అధికారులు పని కల్పించడంలో విఫలమైతే, చట్టంలోని నిబంధనల ప్రకారం సదరు కూలీలకు నిరుద్యోగ భృతి పొందే హక్కు ఉంటుంది.
పాత కార్డులే ప్రస్తుతానికి ఆధారం
MGNREGA స్థానంలో ఈ కొత్త చట్టం అమల్లోకి వస్తున్న నేపథ్యంలో, పాత జాబ్ కార్డుల విషయంలో ప్రభుత్వం స్పష్టతనిచ్చింది. కొత్త గుర్తింపు కార్డులు జారీ చేసే వరకు ప్రస్తుతం ఉన్న ఉపాధి హామీ జాబ్ కార్డులే చెల్లుబాటు అవుతాయని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. జులై 1 నుంచి పాత ఉపాధి హామీ చట్టం (2005) రద్దయి, దాని స్థానంలో ఈ నూతన వ్యవస్థ పూర్తిస్థాయిలో అమల్లోకి వస్తుంది. భారత గ్రామీణ అభివృద్ధి ప్రస్థానంలో ఇదొక మైలురాయిగా నిలవనుందని, గ్రామీణ కుటుంబాల ఆర్థిక స్థిరత్వానికి ఈ 'జీరామ్ జీ' పథకం భరోసాగా మారుతుందని ప్రభుత్వం ధీమా వ్యక్తం చేస్తోంది.














Click it and Unblock the Notifications