G20 summit: ఆ సీన్లు షూట్ చేసేందుకు కశ్మీర్ తప్ప మరొక ప్రాంతం లేదు..!
శ్రీనగర్: జమ్మూ కశ్మీర్లో రాజధాని శ్రీనగర్లో జీ-20 సన్నాహక సదస్సు రెండో రోజు ప్రారంభమైంది. టూరిజం వర్కింగ్ గ్రూప్ సమావేశాలు రెండో రోజు కొనసాగుతున్నాయి.షేర్ ఈ కశ్మీర్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ సెంటర్ వేదికగా ఈ సమావేశాలు జరుగుతున్నాయి. రాష్ట్రం పారిశ్రామికంగా, పర్యాటక పరంగా మరింత ముందుకు వెళ్లడంలో జీ-20 సన్నాహక సదస్సులు దోహదపడుతున్నాయని స్థానిక ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఇక రెండో రోజున అతిథులు పలు అంశాలపై మాట్లాడతారు. అనంతరం వీరందరినీ పలు పర్యాటక ప్రాంతాలకు తీసుకెళ్లడం జరుగుతుంది.ఇందులో నిషాత్ గార్డెన్, చష్మా షాహి, పరి మహల్, కశ్మీర్ ఆర్ట్స్ ఎంపోరియం పోలో వ్యూ మార్కెట్లు ఉన్నాయి. అనంతరం వీరికి పసందైన విందును ఏర్పాటు చేస్తారు.ఇక శ్రీనగర్లో జరుగుతున్న జీ-20 సన్నాహక సదస్సు అంతర్జాతీయంగా కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. జమ్మూ కశ్మీర్లో పరిస్థితులు చాలా మెరుగయ్యాయని ఈ సదస్సు ద్వారా ప్రపంచానికి భారత్ చాటుతోంది.

తొలి రోజు సమావేశం చైనా, పాకిస్తాన్ దేశాలు లేకుండానే సాగాయి. ఈ రెండు దేశాలు సమావేశాన్ని బహిష్కరించాయి. ఈ ఏడాది సెప్టెంబర్ నెలలో న్యూఢిల్లీలో జీ-20 సదస్సు నిర్వహణకు ముందు పలు అంశాలపై సన్నాహక సదస్సులు భారత్లోని పలు నగరాల్లో నిర్వహిస్తున్నారు. ఈ సన్నాహక సదస్సుకు జీ-20 దేశాల నుంచి ప్రతినిధులు హాజరవుతూ వారి అభిప్రాయాలను పంచుకుంటున్నారు.
సోమవారం రోజున శ్రీనగర్కు చేరుకున్న అతిథులకు నగరం ఘనస్వాగతం పలికింది. రహదారులకు ఇరువైపులా నగరాన్ని అత్యంత సుందరంగా తీర్చి దిద్దారు.జమ్మూ కశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత శ్రీనగర్లో తొలిసారిగా నిర్వహిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మకమైన కార్యక్రమం జీ-20 సమావేశం కావడం విశేషం. దీంతో శ్రీనగర్లో గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు. చీమ చిటుక్కుమన్న తెలిసేలా నిఘా వ్యవస్థను పటిష్టం చేశారు.
తొలిరోజు మాట్లాడిన అతిథులు సినిమా షూటింగులకు కశ్మీర్ కంటే అనువైన ప్రాంతం మరొకటి లేదని కొనియాడారు.పర్యాటక ప్రాంతంగా ఎంతో అభివృద్ధి చెందిందని వక్తలు చెప్పారు. ప్రపంచంలో సినిమాలు షూట్ చేయాలంటే చాలా ప్రాంతాలున్నాయి కానీ ఒక రొమాంటిక్ సీన్ షూట్ చేయాలంటే అందుకు కశ్మీర్ మాత్రమే బాగుంటుందని చెప్పారు అమితాబ్ కాంత్.












Click it and Unblock the Notifications