సెంట్రల్ జైల్లో గాలి జనార్దన్ రెడ్డి: నో బెయిల్, చివరి నిమిషంలో సెలవు!
బెంగళూరు: కేంద్ర మంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు అనంత్ కుమార్ ఆకస్మిక మృతితో కర్ణాటక మాజీ మంత్రి, మైనింగ్ కింగ్ గాలి జనార్దన్ రెడ్డికి బెయిల్ రావడం ఒక్క రోజు ఆలస్యం అవుతోంది. అనంత్ కుమార్ మరణంలో కోర్టులకు సెలవు ప్రకటించడంతో మంగళవారం వరకు గాలి జనార్దన్ రెడ్డి పరప్పన అగ్రహార జైల్లో విచారణ ఖైదీగానే ఉండాల్సా వచ్చింది.
రెండో రోజు జైల్లో గాలి
కేంద్ర మంత్రి అనంత్ కుమార్ అనారోగ్యంతో సోమవారం వేకువ జామున మరణించారు. ఆంబిడెంట్ కంపెనీ చీటింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ ఆదివారం అరెస్టు అయిన గాలి జనార్దన్ రెడ్డి పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో విచారణ ఖైదీగా శిక్ష అనుభవిస్తున్నారు.
కోర్టుకు లాయర్లు
బెంగళూరులోని 1వ ఏసీఎంఎం న్యాయస్థానంలో గాలి జనార్దన్ రెడ్డికి సోమవారం బెయిల్ తీసుకోవాలని ఆయన న్యాయవాదులు హనుమంతరాయ, ఆచార్య, చంద్రశేఖర్ లు అన్ని పత్రాలు సిద్దం చేసుకున్నారు. అయితే కేంద్ర మంత్రి అనంతకుమార్ మరణంతో కోర్టుకు సెలవు ప్రకటించారు.
కోర్టుకు సెలవు
సోమవారం కోర్టుకు సెలవు కావడంతో గాలి జనార్దన్ రెడ్డి బెయిల్ కోసం మంగళవారం ఆయన న్యాయవాదులు న్యాయస్థానంలో అర్జీ సమర్పించనున్నారు. సోమవారం పూర్తిగా గాలి జనార్దన్ రెడ్డి పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లోనే ఉండాలని సీసీబీ పోలీసులు అంటున్నారు.
ఈడీ కేసుల దెబ్బ
ఈడీ నమోదు చేసిన కేసుల నుంచి తప్పిస్తానని ఆంబిడెంట్ కంపెనీ నిర్వహకులతో రూ. 20 కోట్లకు మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి డీల్ కుదుర్చుకున్నారని ఆరోపిస్తూ సీసీబీ పోలీసులు కేసు నమోదు చెయ్యడంతో ఆదివారం సాయంత్రం ఆయన్ను అరెస్టు చేసి పరప్పన అగ్రహార సెంట్రల్ జైలుకు తరలించారు.
ప్రత్యేక సౌకర్యాలు
గాలి జనార్దన్ రెడ్డిని కలుసుకుని మాట్లాడటానికి ఆయన కుటుంబ సభ్యులు, న్యాయవాదులు పరప్పన అగ్రహార సెంట్రల్ జైలు ముందు వేచి ఉన్నారు. గాలి జనార్దన్ రెడ్డికి ఎలాంటి ప్రత్యేక సౌకర్యాలు కల్పించడం లేదని, బయటి నుంచి భోజనం అనుమతించలేదని జైళ్ల శాఖ అధికారులు అంటున్నారు.