గాలి ఎక్కడ ? సీఐడీ అదుపులో భీమా: పరుగో పరుగు
గాలి ఎక్కడ ? సీఐడీ అదుపులో భీమా: పరుగో పరుగు
బెంగళూరు/మండ్య: మైనింగ్ కింగ్ గాలి జనార్దన్ రెడ్డి కుమార్తె వివాహం సందర్బంగా రూ. 100 కోట్ల పెద్ద పాతనోట్లను కొత్తనోట్లుగా మార్చి ఇచ్చారా ? లేదా ? అని విచారణ మొదలైయ్యింది. ఆత్మహత్య చేసుకునే ముందు డ్రైవర్ రమేష్ గౌడ రాసిపెట్టిన డెత్ నోట్ ఆదారంగా సీఐడి అధికారులు సోమవారం మద్యాహ్నం విచారణ మొదలు పెట్టారు.
డ్రైవర్ రమేష్ మండ్య జిల్లా మద్దూరులో ఆత్మహత్య చేసుకునే ముందు రాసి పెట్టిన 11 పేజీల డెత్ నోట్ ను పోలీసు అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నా ఆత్మహత్యకు రెవెన్యూ శాఖ అధికారి (కేఏఎస్ అధికారి) భీమా నాయక్, ఆయన సొంత కారు డ్రైవర్ మహమ్మద్ కారణం అని రమేష్ డెత్ నోట్ లో ఆరోపించాడు.
ఐదు రోజుల నుంచి తప్పించుకు తిరుగుతున్న భీమా నాయక్ ను కులబర్గిలోని సెంట్రల్ బస్ స్టాడ్ వెనుక ఉన్న సీఐబీ కాలనీలో బంధువుల ఇంటిలో తలదాచుకున్నాడని కచ్చితమైన వివరాలు సేకరించిన పోలీసు అధికారులు ఆయన్ను అరెస్టు చేసి మద్దూరుకు తీసుకు వచ్చారు.
మద్దూరు న్యాయస్థానంలో భీమా నాయక్ ను హాజరుపరిచామని, న్యాయస్థానం ఆదేశాల మేరకు ఆయన్ను సీఐడీ పోలీసు అధికారులకు అప్పగించామని మండ్య జిల్లా ఎస్పీ సీహెచ్. సుధీర్ కుమార్ రెడ్డి చెప్పారు.
భీమా నాయక్ ను అదుపులోకి తీసుకున్న సీఐడీ అధికారులు మొత్తం వివరాలను బయటకు లాగుతున్నారు. గాలి జనార్దన్ రెడ్డికి, భీమా నాయక్ కు ఉన్న లింక్ ఏమిటీ ? రమేష్ ఎందుకు గాలి జనార్దన్ రెడ్డి పేరు డెత్ నోట్ లో పెట్టాడు ? అని ఆరా తీస్తున్నారు.
అదే విధంగా గాలి జనార్దన్ రెడ్డి తన కుమార్తె పెళ్లి కోసం రూ. 100 కోట్ల పాత పెద్ద నోట్లు భీమా నాయక్ కు ఇచ్చారా ? ఆ నోట్లను కమీషన్ పద్దతిలో భీమా నాయక్ కొత్త నోట్లుగా మార్పిడి చేసి ఇచ్చారా ? వీరికి ఎవరు సహాయం చేశారు ? ఏ బ్యాంకుల్లో వీరు కొత్త నోట్లు తీసుకున్నారు ? అంటూ సీఐడీ అధికారులు పూర్తి వివరాలు బయటకు లాగుతున్నారు.