గుర్మీత్ను వదిలేయాలంటూ రాజకీయ ఒత్తిళ్లు? సడలని ఉద్రిక్తత, సైన్యం మోహరింపు!
డేరా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ అత్యాచార కేసు విచారణలో కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐపై తీవ్ర స్థాయిలో ఒత్తిళ్లు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ కేసు విచారణ చేపట్టిన సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ ము
న్యూఢిల్లీ: డేరా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ అత్యాచార కేసు విచారణలో కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐపై తీవ్ర స్థాయిలో ఒత్తిళ్లు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ కేసు విచారణ చేపట్టిన సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ ములిన్జా నారాయణన్ ఈ కేసుకు సంబంధించి పలు కీలక విషయాలను వెల్లడించారు.
గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ ను అత్యాచార కేసులో కోర్టు దోషిగా ప్రకటించిన అనంతరం జరుగుతున్న హింసాత్మక పరిణామాలు తెలిసిందే. డేరా చీఫ్ గుర్మీత్.. పలువురు రాజకీయ నేతలను, సెలబ్రిటీలను దైవం పేరుతో తన గుప్పిట్లో పెట్టుకున్నారు. డేరా చీఫ్ విషయంలో సీబీఐ పారదర్శక దర్యాప్తుతోనే బాధితులకు న్యాయం జరిగిందని చాలా మంది అభిప్రాయపడుతున్నారు.

విచారణ ఆపేయాలంటూ తీవ్ర ఒత్తిడి...
డిసెంబర్ 12, 2002 లో పంచకుల ప్రత్యేక కోర్టు ఆదేశాల మేరకు అత్యాచార ఆరోపణలతో సీబీఐ కేసు నమోదు చేసింది. అప్పట్లో ఢిల్లీలో స్పెషల్ క్రైమ్స్ విభాగంలో డిప్యూటీ ఐజీ హోదాలో ఉన్న ములిన్జా నారాయణన్ కు నేరుగా సీబీఐ జాయింట్ డైరక్టర్ పగ్గాలతోపాటు గుర్మీత్ కేసును కూడా ప్రభుత్వం అప్పగించింది. ‘ఆ సమయంలో సీబీఐలోని ఓ ఉన్నతాధికారి నా గదిలోకి ప్రవేశించారు. ఎలాంటి చర్యలు చేపట్టవద్దని, తక్షణమే కేసు మూసేయాలని సూచించారు' అని ములిన్జా తెలిపారు. అయితే ఈ కేసులో చాలా విషయం ఉందని గుర్తించిన ములిన్జా మరింత లోతుగా విచారణ చేపట్టారంట. మరోవైపు దర్యాప్తు కొనసాగుతుండగానే చాలా మంది బడా నేతలు, వ్యాపార వేత్తలు దర్యాప్తు సంస్థ ప్రధాన కార్యాలయానికి వచ్చి కేసు మూసేయాలంటూ ఒత్తిడి చేశారని కూడా ఆయన ఆరోపించారు. అయినప్పటికీ తాను వెనక్కి తగ్గలేదని, ఎట్టకేలకు న్యాయమే గెలిచిందని 67 ఏళ్ల ములిన్జా వ్యాఖ్యానించారు.

గుర్మీత్ పరోక్షంగా బెదిరించారు...
ఇక ఈ కేసులో బాధిత మహిళల్లో ఒకరిని కనిపెట్టడం చాలా కష్టతరంగా మారిందని అప్పట్లో సీబీఐ జేడీగా ఉన్న ముల్జినా చెప్పారు. 1999 లో ఆమె గుర్మీత్ చేతిలో లైంగిక దాడికి గురయ్యాక డేరా(ఆశ్రమం) వదిలి వెళ్లిపోయారని, ఆ తరువాత ఆమె వివాహం చేసుకోవటంతో.. విచారణకు సహకరిస్తారా? అన్న అనుమానాలు వ్యక్తమయ్యాయని, అయినప్పటికీ ఆమె భర్త, కుటుంబ సభ్యులు తమ విచారణకు బాగా సహకరించారని ఆయన పేర్కొన్నారు. అంతేకాదు, కేసు విచారణ సమయంలో గుర్మీత్ కూడా తాను బాబానంటూ పరోక్షంగా బెదిరించేందుకు యత్నించారంటూ ములిన్జా గుర్తు చేసుకున్నారు. ఇలాంటి ఆటలో ఒక్కోసారి మేం గెలవచ్చు.. ఒక్కోసారి ఓడిపోవచ్చు.. కానీ, చట్టం నుంచి మాత్రం ఎవరూ తప్పించుకోలేరని ఆయన పేర్కొన్నారు.

జడ్ ప్లస్ సెక్యూరిటీ ఉపసంహరణ...
అత్యాచారం కేసులో గుర్మీత్ సింగ్ రామ్ రహీమ్ దోషిగా తేలడంతో ఆయనకు కల్పిస్తోన్న జడ్ప్లస్ కేటగిరీ భద్రతను ఉపసంహరించుకున్నట్లు హర్యానా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దీపిందర్ సింగ్ చెప్పారు. సీబీఐ కోర్టు తీర్పు అనంతరం రాష్ట్రంలో చెలరేగిన హింసాకాండపై శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఆందోళనల్లో ఇప్పటి వరకూ 31 మంది చనిపోయారని, 250 మంది గాయపడ్డారని సీఎస్ సింగ్ తెలిపారు. శుక్రవారం రాత్రి 15 మంది డేరా కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నామని, ఆయా బృందాలపై రెండు దేశద్రోహం కేసులు పెట్టామని చెప్పారు. పంచకుల కోర్టు నుంచి గుర్మీత్ను హెలికాప్టర్లో రోహతక్ జైలుకు తరలించామన్న సీఎస్.. జైలులో దోషికి వీఐపీ సేవలు అందుతున్నాయన్న వార్తలను ఖండించారు. గుర్మీత్ను సాధారణ ఖైదీగానే చూస్తున్నామని, అందరూ తినే ఆహారాన్నే ఆయనకూ అందిస్తున్నామని వివరించారు.

హర్యానాలో సడలని ఉద్రిక్తత...
డేరా చీఫ్ గుర్మీత్ కేసులో కోర్టు తిర్పు అనంతరం ఉత్తర భారతంలోని ఆరు రాష్ట్రాల్లో డేరా సచ్ఛా సౌధా కార్యకర్తలు ఆందోళనలు చేపట్టిన సంగతి తెలిసిందే. హర్యానా, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, ఢిల్లీ, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్లలో శుక్రవారం రాత్రి వరకూ తీవ్ర ఉద్రిక్తత కొనసాగింది. అయితే శనివారం మధ్యాహ్నానికల్లా పంజాబ్, ఢిల్లీ, యూపీ, హిమాచల్, రాజస్థాన్ రాష్ట్రాల్లోని జిల్లాల్లో పరిస్థితి అదుపులోకి వచ్చింది. ప్రస్తుతం అక్కడ ఎలాంటి ఆందోళనలూ చోటుచేసుకోనప్పటికీ కర్ఫ్యూ మాత్రం కొనసాగుతోంది.

భారీగా సైన్యం మోహరింపు...
అయితే, హర్యానాలోని పలు పట్టణాల్లో ఇంకా హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటూనే ఉన్నాయి. దీంతో ఆందోళనలకు కేంద్ర బిందువులైన పంచకుల, సిర్సా, మన్సా, మన్కోట్ పట్టణాలకు పెద్ద ఎత్తున ఆర్మీ బలగాలు తరలివెళ్లాయి.డేరా స్వచ్ఛ సౌధా చీఫ్ గుర్మీత్ 2002లో తన ఆశ్రమంలో సాధ్విలుగా ఉన్న ఇద్దరు మహిళలపై అత్యాచారం చేశారనే ఆరోపణలు రుజువుకావడంతో పంచకుల సీబీఐ కోర్టు ఆయనను శుక్రవారం దోషిగా నిర్ధారించింది. సోమవారం గుర్మీత్కు శిక్షలు ఖరారు కానున్నాయి.

డేరా ఆశ్రమాల మూసివేత...
హైకోర్టు ఆదేశానుసారం పోలీసులు, ఆర్మీ సంయుక్తంగా గుర్మీత్కు చెందిన డేరా సచ్ఛా సౌదా ఆశ్రమాలను ఖాళీ చేయిస్తున్నారు. అంబాలా, కురుక్షేత్ర, కర్నాల్, కైథాల్, పంచకుల తదితర పట్టణాల్లోని డేరా ఆశ్రమాల్లో ఆశ్రయం పొందుతోన్న లక్షల మందిని పోలీసు బలగాలు బయటికి పంపేస్తున్నారు. వారిలో మహిళలు, చిన్నపిల్లల సంఖ్య ఎక్కువగా ఉండటంతో తరలింపు ప్రక్రియ నిదానంగా సాగుతోంది.

సీబీఐ కోర్టు జడ్జికి భద్రత పెంపు...
వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు, డేరా సచ్చ సౌధ చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ను రేప్ కేసులో దోషిగా ప్రకటించిన పంచకుల ప్రత్యేక సీబీఐ కోర్టు జడ్జికి భద్రత పెంచాలని హర్యానా ప్రభుత్వాన్ని కేంద్రం ఆదేశించింది. రామ్ రహీమ్ మద్దతుదారుల ఆందోళనలతో హర్యానాలో పరిస్థితులు అదుపుతప్పడంతో తీర్పు వెల్లడించిన జడ్జి జగదీప్ సింగ్కు పటిష్టమైన భద్రత ఏర్పాటు చేయాలని కేంద్ర హోం శాఖ హర్యానా ప్రభుత్వాన్ని ఆదేశించింది. హర్యానాలోని పరిస్థితులను అంచనా వేసిన నిఘా వర్గాలు జడ్జికి కేంద్ర బలగాలైన సీఆర్పీఎఫ్, సీఐఎస్ఎఫ్తో పటిష్టమైన భద్రత కల్పించాలని సూచించినట్లు అధికారులు చెప్పారు.

ఆర్మీ భద్రత లేకుండా వెళ్లొద్దు...
మరోవైపు హింస నేపథ్యంలో పంజాబ్లోని జిల్లా మెజిస్ట్రేట్లు స్థానిక ఆర్మీ అధికారులతో సంప్రదింపులు జరపాలని రాష్ట్ర హోం శాఖ సూచించింది. ఆర్మీ భద్రత లేకుండా బయటికి ఎవరూ వెళ్లరాదని చెప్పింది. శుక్రవారం గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ను దోషిగా ప్రకటించిన నేపథ్యంలో హింస చెలరేగిన సంగతి తెలిసిందే. కోర్టు తీర్పు అనంతరం ఆయన మద్దతుదారులు పంచకులలో పెద్దఎత్తున ఆందోళనకు దిగడంతో పరిస్థితి అదుపుతప్పింది. దీంతో పోలీసులు లాఠీఛార్జికి దిగారు. గాల్లోకి కాల్పులు జరుపుతూ, బాష్పవాయువును ప్రయోగించారు. దీంతో మరింత రెచ్చిపోయిన ఆందోళనకారులు సంయమనం కోల్పోయి హింసకు పూనుకున్నారు. సీబీఐ కోర్టు వద్ద ఉన్న మీడియా వాహనాలతో పాటు పంచకులలో కనిపించిన ప్రతి వాహనానికి నిప్పు పెట్టారు. కర్రలు, రాళ్లతో వాహనాలను పచ్చడి చేశారు. ముఖ్యంగా ప్రభుత్వ కార్యాలయాల వద్ద ఉన్న వాహనాలకు ఆందోళనకారులు నిప్పుపెట్టారు. సుమారు 100కు పైగా వాహనాలను తగలబెట్టారు. పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో చెలరేగిన హింసలో మొత్తం 30 మంది మృతిచెందారు. 250 మందికి పైగా గాయపడ్డారు.












Click it and Unblock the Notifications