గ్యాంగ్ రేప్ చేసి సెటిల్మెంట్కు పిలిచారు: బాధితురాలు ఆత్మహత్య
న్యూఢిల్లీ: గ్యాంగ్ రేప్కు గురైన బాధితురాలు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన ఈశాన్య ఢిల్లీలోని హర్ష్ విహార్ ప్రాంతంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే... 22 ఏళ్ల యువతిని పెళ్లి చేసుకుంటానని నమ్మించిన ఓ వ్యక్తి తన స్నేహితులతో కలిసి సామూహికంగా అత్యాచారం చేశాడు.
అనంతరం కేసు నమోదు కాకుండా ఉండేందుకు గాను సెటిల్మెంట్కు రావాలంటూ తల్లిదండ్రులపై ఒత్తిడి తీసుకువచ్చాడు. దీనిని భరించలేని ఆ యువతి రాత్రి గదిలోని సీలింగ్ ఫ్యాన్కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. రాత్రి గదిలోకి వెళ్లిన కుమార్తె పొద్దున్నే ఎంతకీ లేవకపోవడంతో తల్లిదండ్రులకు అనుమానం వచ్చింది.
దీంతో తలుపులను పగలగొట్టి చూడటంతో ఫ్యాన్కు ఉరేసుకుని వేళాడుతూ కనిపించింది. దీంతో ఆమెను కిందకు దించి వెంటనే ఆసుపత్రికి తరలించినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. అప్పటికే ఆమె చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. దీంతో పెళ్లి చేసుకుంటానని నమ్మించి స్నేహితుడే తమ మిత్రులతో కలిసి తమ కుమార్తెపై అత్యాచారానికి పాల్పడ్డాడంటూ పోలీసులకు బాధితురాలి తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు.
దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడితోపాటు అతని స్నేహితులను కూడా అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కోర్టులో హాజరపరచగా నిందితుడికి రిమాండ్ విధించారు. ఈ కేసులో స్థానికుల కథనం మరోలా ఉంది. తనను పెళ్లి చేసుకుంటానన్న వ్యక్తితో ఆ యువతి లేచిపోయిందని, దీంతో కుటుంబ సభ్యులు పోలీసుల వద్దకు వెళ్లి అతడిపై కిడ్నాప్, రేప్ కేసు పెట్టారని అంటున్నారు.
ఈ క్రమంలో అతడి స్నేహితుల్లో ఒకరు బాధితురాలిపై అత్యాచారానికి పాల్పడినట్టుగా పోలీసుల విచారణలో వెల్లడైందని సీనియర్ పోలీసు అధికారి ఒకరు చెప్పారు. దీంతో తన కుటుంబానికి చెడ్డ పేరు వచ్చిందని, బాధితురాలు ఆత్మహత్యకు పాల్పడి ఉండొచ్చని అనుమానిస్తున్నామని పోలీసులు తెలిపారు.