బాలికపై గ్యాంగ్ రేప్, హత్య: మంత్రి కుమారుడి విచారణ
బెంగళూరు: బాలిక మీద గ్యాంగ్ రేప్ చేసి హత్య చేసిన సంఘటన వెలుగు చూసింది. అస్సాం రాష్ట్ర మంత్రి కుమారుడు, అతని స్నేహితుల మీద అనుమానం రావడంతో పోలీసులు పలు కోణాలలో దర్యాప్తు చేస్తున్నారు. బెంగళూరు నగరంలోని సంజయ్ నగర పోలీసులు అనుమానస్పద మృతి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
అస్పాం చేనేత వస్రాలు, పట్టుపురుగుల పెంపకం, సాంసృతిక వ్యవహారాల శాఖ మంత్రి ప్రణతి పూకాన్ కుమారుడు రీతూరాజ్ బెంగళూరు చేరుకుని భూపసంద్రంలో స్నేహితులతో కలిసి నివాసం ఉంటున్నాడు. రీతూరాజ్ పూకాన్, పల్లవ్ పూకాన్ తో సహ నలుగురు మార్కెటింగ్ బిజినెస్ ఫర్మ్ అనే కార్యాలయం నిర్వహిస్తున్నారు.
ఇక్కడ 10 సంవత్సరాల బాలిక తల్లి ఆఫీస్ అసిస్టెంట్ గా ఉద్యోగం చేస్తున్నది. ఈమె సోదరుడు రీతూరాజ్ తో కలిసి భూపసంద్రలోనే నివాసం ఉంటున్నాడు. బాలిక, ఆమె తల్లి నాగశెట్టిహళ్ళిలో నివాసం ఉంటున్నారు. ఈనెల మొదటి వారంలో బాలిక అనారోగ్యానికి గురైయ్యింది.
జూన్ 6 వ తేదిన బాలికను ఎంఎస్ రామయ్య ఆసుపత్రికి తరలించారు. తన కుమార్తెకు డెంగ్యూ జ్వరం వచ్చిందని, విరేచనాలతో భాదపడుతున్నదని బాలిక వైద్యులకు చెప్పింది. బాలికకు వైద్యులు చికిత్స చేశారు. అయితే బాలిక శరీరంలోని ప్రయివేటు భాగాలలో గాయాలై రక్తం కారుతున్న విషయం గుర్తించారు.
వెంటనే బాలికకు మెరుగైన చికిత్స చెయ్యడానికి ప్రయత్నించిన సమయంలో మరణించింది. వైద్యులకు అనుమానం రావడంతో బాలిక శరీరాన్ని ఫోరెన్సిక్ డిపార్ట్ మెంట్ కు తరలించి పోస్టుమార్టుం నిర్వహించారు. విషయం తెలుసుకున్న సంజయ్ నగర పోలీసులు సంఘటనా స్థలానికి చేరకుని వివరాలు సేకరించారు.
అయితే బాలిక తల్లి పోలీసులకు సైతం తన కుమార్తె మీద అత్యాచారం చేశారని ఫిర్యాదు చెయ్యలేదు. డెంగ్యూ జ్వరం అని మాత్రం చెప్పిందని డీసీపీ టీ.ఆర్. సురేష్ తెలిపారు. సంజయ్ నగర పోలీసులు అస్సాం మంత్రి కుమారుడు రీతూరాజ్, అతని స్నేహితులను స్టేషన్ కు పిలిపించి విచారించారు.
ఆ నలుగురు ఇచ్చిన స్టేట్ మెంట్ రికార్డు చేశారు. బాలిక మృతదేహాన్ని ఆమె తల్లికి అప్పగించామని, ముంబైలో అంత్యక్రియలు చెయ్యడానికి తీసుకు వెళ్లారని పోలీసులు చెప్పారు. ఎంఎస్ రామయ్య ఆసుపత్రి వైద్యులు బాలిక మీద లైంగిక దాడి జరిగిందని అంటున్నారు.
చాల కాలం నుండి బాలిక మీద లైంగిక దాడి జరుగుతున్నదని వైద్యులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. బాలిక శరీరం నుండి సేకరించిన రక్తం, అవయవాలను ఫోరెన్సిక్ ల్యాబరోటరికితో పాటు డెంగ్యూ జ్వరం ఉందా అని పరిక్షలు నిర్వహిస్తున్నారు. కేసు దర్యాప్తులో ఉందని సంజయ్ నగర పోలీసులు తెలిపారు.