గ్యాంగ్ రేప్ కు గురైన బాధితురాలిపై మళ్లీ గ్యాంగ్ రేప్
రోహ్ టక్ : దేశంలో మహిళా భద్రత ఎంతకు దిగజారిపోయిందో తెలియచెప్పడానికి దీన్ని మించిన ఉదాహరణ లేదు. మూడేళ్ల క్రితం ఓ దళిత స్త్రీని గ్యాంగ్ రేప్ చేసిన నిందితులు.. రేప్ కేసును విరమించుకోనందుకు గాను మరోసారి ఆమెపై గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డారు.
హర్యాణలోని రోహ్ టక్ లో చోటు చేసుకున్న ఈ ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. భివానిలో ఉండే ఓ బాధితురాలిపై మూడేళ్ల క్రితం ఐదుగురు దుండగులు అత్యాచారానికి తెగబడి ఆమెను గ్యాంగ్ రేప్ చేశారు. అనంతరం బాధితురాలు కేసు నమోదు చేసినా.. అరెస్టయిన నిందితులంతా బెయిల్ పై విడుదలయ్యారు.
ఇక అప్పటినుంచి కేసును ఉపసంహరించుకోవాల్సిందిగా బాధితురాలిని బెదిరించడం మొదలుపెట్టారు నిందితులు. ఆఖరికి నిందితుల వేధింపులు తాళలేక బాధితురాలి కుటుంబం భివాని నుంచి రోహ్ టక్ కు మారిపోయింది. ఇదే క్రమంలో బాధితురాలిపై కక్ష గట్టిన నిందితులు ఆమెపై మరోసారి గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డారు.
రోహ్ టక్ లోని ఓ మహిళా కళాశాలలో చదువుతోన్న బాధితురాలు బుధవారం పొద్దుపోయిన ఇంటికి చేరుకోలేదు. దీంతో అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు అంతటా గాలించగా.. సుఖ్ పర చౌక్ వద్ద బాధితురాలు అపస్మారక స్థితిలో ఉన్నట్టు గుర్తించారు. తక్షణం ఆమెను సమీపంలోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
కాగా, బాధితురాలు చెప్పిన వివరాల ప్రకారం.. నిందితులు ఆమెను కిడ్నాప్ చేసి కారులో తీసుకెళ్లి, ఆపై గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డారని తెలిపింది. దీంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.