స్వలింగ సంపర్కానికి సహకరించట్లేదని మర్మాంగాన్ని కత్తిరించిన వైనం: లవర్స్ డే నాడే..!
బెంగళూరు: కర్ణాటకలో దిగ్భ్రాంతికర ఘటన చోటు చేసుకుంది. ఇద్దరు స్వలింగ సంపర్కుల మధ్య చోటు చేసుకున్న ఘర్షణ విషాదాంతానికి దారి తీసింది. స్వలింగ సంపర్కానికి సహకరించట్లేదనే ఆగ్రహంతో ఓ యువకుడు తన స్నేహితుడిపై కత్తితో దాడి చేశాడు. అతని మర్మాంగాన్ని కత్తిరించాడు. ఈ ఘటనలో పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. అతను తన నేరాన్ని అంగీకరించినట్లు తెలిపారు.

కాలేజీ విద్యార్థితో సంబంధం..
నిందితుడి పేరు సునీల్ కుమార్ అలియాస్ సుని. కర్ణాటకలోని మండ్య జిల్లా పాండవపుర తాలూకా పరిధిలోని సీతాపుర గ్రామంలో నివసిస్తున్నాడు. అదే జిల్లాకు చెందిన ఓ విద్యార్థితో అతనికి పరిచయం ఏర్పడింది. అదే జిల్లా కేఆర్ పేటెలోని ఓ కాలేజీలో చదువుకుంటున్న విద్యార్థిని ప్రతి శుక్రవారం కలుసుకునేవాడు. కిందటి నెల 14వ తేదీన బాధిత విద్యార్థి తీవ్ర రక్తస్రావాలతో సీతాపుర రైల్వే గేట్ సమీపంలో కనిపించాడు.

పరువు పోతుందనే భయంతో అసలు విషయం దాచి పెట్టి..
వెంటనే అతణ్ని ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ కోలుకుంటున్నాడు. ఈ ఘటనపై శ్రీరంగపట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు. పరువు పోతుందనే భయంతో దర్యాప్తు సందర్భంగా బాధిత విద్యార్థి అసలు విషయాన్ని వెల్లడించడానికి నిరాకరించాడు. కాలేజీ నుంచి వస్తోన్న తనను ముగ్గురు వ్యక్తులు ఓ కారులో కిడ్నాప్ చేశారని, అనంతరం తన మర్మాంగాన్ని కత్తిరించారని పోలీసులకు వివరించాడు. బాధితుడు చెప్పిన వివరాల ప్రకారం.. పోలీసులు దర్యాప్తు చేపట్టినప్పటికీ.. కిడ్నాప్ వ్యవహారం వెలుగులోకి రాలేదు.

పెళ్లి చేసుకోకూడదనే
దీనితో మరోసారి పోలీసులు బాధిత విద్యార్థిని విచారించడంతో అతను అసలు విషయాన్ని అంగీకరించాడు. సీతాపుర గ్రామానికి చెందిన సునీల్ కుమార్ అనే వ్యక్తితో చోటు చేసుకున్న ఘర్షణ సందర్భంగా అతను మర్మాంగాన్ని కత్తిరించినట్లు వెల్లడించాడు. తనతోనే ఉండాలని, భవిష్యత్తులో పెళ్లి కూడా చేసుకోకూడదంటూ సునీల్ కుమార్ తనను ఆదేశించాడని, ఈ విషయంలో ఇద్దరి మధ్య ఘర్షణ తలెత్తిందని అన్నాడు. తనకు పెళ్లి జరగకూడదనే ఉద్దేశంతో మర్మాంగాన్ని కత్తిరించాడని తెలిపాడు.

అరెస్టు భయంతో తప్పించుకుని తిరుగుతూ..
ఆ విద్యార్థి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు శ్రీరంగపట్టణ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ విషయం తెలిసిన వెంటనే సునీల్ కుమార్ మాయం అయ్యాడు. పోలీసుల నుంచి తప్పించుకోవడానికి బెంగళూరు, మైసూరు సహా పలు నగరాల్లో తలదాచుకున్నాడు. సెల్ ఫోన్ సిగ్నళ్ల ఆధారంగా నిందితుడిని పోలీసులు అరెస్టు చేసి, శ్రీరంగపట్టణానికి తీసుకొచ్చారు. అతనిపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు.












Click it and Unblock the Notifications