లింగ సమానత్వం వాయిదా కుదరదు; ఎన్డిఎ నవంబర్ పరీక్షపై కేంద్రం అఫిడవిట్ ; సుప్రీం కీలక ఆదేశం
నేషనల్ డిఫెన్స్ అకాడమీ (ఎన్డిఎ) లో నవంబర్ 2021 ప్రవేశ పరీక్షకు మహిళా అభ్యర్థులను తప్పనిసరిగా అనుమతించాలని అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది. మహిళా అభ్యర్థులను పరీక్షకు అనుమతించే నోటిఫికేషన్ వచ్చే ఏడాది మే నాటికి వెలువడుతుందని రక్షణ మంత్రిత్వ శాఖ సుప్రీంకోర్టుకు తెలియజేసిన తర్వాత సుప్రీం ధర్మాసనం ఈ ఆదేశం ఇచ్చింది. మహిళలు తప్పనిసరిగా నవంబర్ 2021 పరీక్షలకు అనుమతించబడాలని అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది. నవంబర్ పరీక్షల విషయంలో బాలికలకు అవకాశం ఇవ్వటంతో ఇబ్బందులపై కేంద్రం అదనపు అఫిడవిట్ దాఖలు చేసిన నేపధ్యంలో సుప్రీం ఈ విధంగా స్పందించింది.
కేంద్రం చారిత్రాత్మక నిర్ణయం : ఎన్డిఏ లో మహిళలకు స్థానం, ఇకపై జాతీయ రక్షణలో వీర వనితలు
ఎన్డిఎ లో మహిళల ప్రవేశానికి చారిత్రక నిర్ణయం తీసుకున్నకేంద్రం
నేషనల్ డిఫెన్స్ అకాడమీకి గతంలో మహిళలకు ప్రవేశం లేదు. అయితే ఎన్డిఎ పరీక్షలకు అనుమతినివ్వాలని, అనేకమార్లు బాలికలు కోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో, కోర్టు కేంద్రంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. లింగ వివక్ష చూపించడం సరికాదని, ఇది ఆర్మీ మైండ్ సెట్ ను ప్రతిబింబిస్తుందని సుప్రీం కోర్టు అక్షింతలు వేసింది. ఆ తర్వాత చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్న కేంద్రం ఎన్డిఎ లో మహిళలకు అవకాశం కల్పిస్తున్నట్లు ప్రకటించింది. అందుకోసం ఏర్పాట్లు చేస్తున్నట్టు వెల్లడించింది. ఇందులో భాగంగా మౌలిక వసతుల కల్పనకు సమయం పడుతుందని, మహిళా క్యాడెట్ ల ప్రమాణాల సూత్రీకరణకు సమయం పడుతుందని చెప్పిన కేంద్రం ఈ సారి పరీక్షలకు మహిళా అభ్యర్థులకు అవకాశం లేదని కోర్టుకు చెప్పింది.
యూపీఎస్సీ నవంబర్ పరీక్షకు నోటిఫికేషన్ ను సవరించి జారీ చేయాలన్న సుప్రీం
కేంద్రం మహిళా అభ్యర్థులకు కూడా నేషనల్ డిఫెన్స్ అకాడమీ లో ప్రవేశానికి ఆమోదం తెలిపిన తర్వాత కూడా ఈ నిర్ణయాన్ని ఒక సంవత్సరం పాటు వాయిదా వేయరాదని సుప్రీం ధర్మాసనం పేర్కొంది. మహిళా అభ్యర్థులకు సంబంధించిన వైద్య ప్రమాణాలను తాత్కాలిక ప్రాతిపదికన నిర్ణయించాలని వెల్లడించింది. యూపీఎస్సీ నవంబర్ పరీక్షకు నోటిఫికేషన్ ను సవరించి జారీ చేయాలని సుప్రీం పేర్కొంది. లింగ సమానత్వం వాయిదా వేయబడదు అని సుప్రీం ధర్మాసనం ఈ సందర్భంగా స్పష్టం చేసింది.
వచ్చే ఏడాది నుండి మహిళా అభ్యర్థులకు అవకాశం ఇస్తామన్న కేంద్రం
నేషనల్ డిఫెన్స్ అకాడమీ (NDA) మహిళా క్యాడెట్ల ప్రవేశానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా వచ్చే ఏడాది నుండి అడ్మిషన్లు ఇస్తామని చెప్పింది. ఈ ఏడాది నవంబర్లో జరగనున్న పరీక్షలకు కాకుండా, మే 2022 నుండి ప్రవేశ పరీక్షకు మహిళలు హాజరుకావచ్చని ప్రభుత్వం సుప్రీం ధర్మాసనం దృష్టికి తీసుకు వెళ్ళింది. సుప్రీం కోర్టు ముందు దాఖలు చేసిన అదనపు అఫిడవిట్లో, ప్రభుత్వం తగిన వైద్య మరియు శారీరక ఫిట్నెస్ ప్రమాణాలను నిర్ణయించే ప్రక్రియలో ఉందని, మహిళలను కూడా క్యాడెట్లు గా అనుమతి ఇస్తున్న నేపథ్యంలో అవసరమైన మౌలిక సదుపాయాలను నిర్మించే ప్రక్రియలో ఉందని, దీనికి కొంత సమయం పడుతుందని అందుకే వచ్చే మే నాటికి మహిళలకు ప్రవేశ పరీక్షలో అనుమతిస్తామని కేంద్ర ప్రభుత్వం సుప్రీం దృష్టికి తీసుకు వెళ్ళిం
మహిళా అభ్యర్థుల ప్రమాణాల సూత్రీకరణ, మౌలిక వసతుల కల్పనకు సమయం కావాలన్న కేంద్రం
పురుష క్యాడెట్ల ప్రమాణాలు అమలులో ఉన్నాయని, మహిళలకు తగిన ప్రమాణాలు సూత్రీకరణ ప్రక్రియలో ఉన్నాయని పేర్కొంది. మహిళా అభ్యర్థులకు సమాంతర (భౌతిక) ప్రమాణాలు లేనందున వాటిని రూపొందించే పనిలో ఉన్నామని పేర్కొంది. ఈ క్రమంలోనే నవంబర్లో జరగనున్న పరీక్షకు మహిళలను అనుమతించలేమని, మే 2022 నుంచి మహిళలు ఎన్డిఎ పరీక్షకు హాజరు కావచ్చని ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. మహిళా క్యాడెట్ల ప్రవేశానికి ముందు గైనకాలజిస్టులు, స్పోర్ట్స్ మెడిసిన్ నిపుణులు మరియు కౌన్సిలర్లు, నర్సింగ్ సిబ్బంది మరియు మహిళా అటెండెంట్లను కూడా నియమించాలని ప్రభుత్వం తెలిపింది.
అనేక సాంకేతిక కారణాలను కోర్టు దృష్టికి తీసుకెళ్ళిన కేంద్రం .. సూచనలు చేసిన సుప్రీం
ఎన్డిఎ మహిళా క్యాడెట్ల కోసం సమగ్ర పాఠ్యాంశాలను త్వరితగతిన రూపొందించడానికి నిపుణులతో కూడిన స్టడీ గ్రూప్ ఏర్పాటు చేయబడిందని, అనేక సాంకేతిక కారణాల నేపథ్యంలోనే నవంబర్లో జరగనున్న పరీక్షలకు అనుమతించలేమని కేంద్రం స్పష్టం చేసింది. అయితే కోర్టు మరోమారు నవంబర్ లో కూడా మహిళా అభ్యర్థులను పరీక్షలకు అనుమతించాల్సిందిగా, మహిళా అభ్యర్థుల కోసం కేంద్రం చెప్తున్న ఇబ్బందుల విషయంలో తాత్కాలిక ఏర్పాట్లు చేసుకోవాల్సిందిగా సూచించింది.