ఆటోలో తీసుకెళ్లి జర్మనీ యువతిపై అత్యాచారయత్నం

ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. బాధిత యువతి న్యూఢిల్లీలో మెనేజ్మెంట్ కోర్సు చేస్తోంది. మార్చి 8న ఆమె బరకంభ రోడ్లో తన గమ్య స్థానానికి వెళ్లేందుకు ఓ ఆటోలో ఎక్కింది. ఆ తర్వాత లజ్పత్నగర్ ప్రాంతానికి సమీపంలోని నిర్మానుష్య ప్రదేశంలో ఆటోను నిలిపేశాడు డ్రైవర్.
ఆటోలో ఏదో రిపేర్ వచ్చిందని చెప్పి అతని మిత్రులకు ఫోన్ చేశాడు. ఆ తర్వాత యువతిపై లైంగిక వేధింపులకు పాల్పడటం మొదలుపెట్టాడు. అంతలోనే అతని మిత్రులైన ఆటో డ్రైవర్లు అక్కడికి చేరుకున్నారు. అందరూ కలిసి ఆమె దగ్గర ఉన్న విలువైన వస్తువులను దోచుకున్నారు. అనంతరం ఆమెను అక్కడే వదిలేసి పారిపోయారు.
కాగా, ఘటనపై లజపత్నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన యువతికి, వారు కన్నాట్ ప్లేస్ పోలీస్ స్టేషన్ను ఆశ్రయించాలని చెప్పారు. దీంతో ఆమె అక్కడికి వెళ్ళింది. అక్కడికి వెళ్ళిన యువతిని బరాకంభ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని కోరారు. చివరకు ఆమె ఫిర్యాదును బరకంభ పోలీసులు స్వీకరించి నిందితులపై కేసు నమోదు చేశారు. నిందితులను గుర్తించేందుకు బాధిత యువతి ఆటో ఎక్కిన స్థలంలోని సిసి కెమెరాల ఫుటేజీని సేకరిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications