నోట మాట రావట్లేదు - అలాంటి లెటర్ ఎక్స్పెక్ట్ చేయలేదు..!!
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు గులాం నబీ ఆజాద్ బాంబు పేల్చారు. కాంగ్రెస్ పార్టీకి గుడ్బై చెప్పారు. ప్రాథమిక సభ్యత్వానికీ రాజీనామా చేశారు. కాంగ్రెస్ అధిష్ఠానంపై తీవ్ర అసంతృప్తితో ఉంటూ వస్తోన్న ఆజాద్.. ఇవ్వాళ ఏకంగా పార్టీ నుంచి తప్పుకొన్నారు. తన రాజీనామా లేఖను పార్టీ అధిష్ఠానానికి పంపించారు. పార్టీతో సుదీర్ఘకాలంగా కొనసాగుతూ వస్తోన్న అనుబంధాన్ని తెంచుకున్నారు.
అఖిల భారత కాంగ్రెస్ కమిటీ మాజీ అధినేత, ఎంపీ రాహుల్ గాంధీని ఆజాద్ లక్ష్యంగా చేసుకున్నారు. సోనియా గాంధీకి పంపించిన అయిదు పేజీల లేఖలో కీలక విషయాలను ప్రస్తావించారు. రాహుల్ గాంధీది చిన్నపిల్లాడి మనస్తత్వంగా అభివర్ణించారు. 2013లో ఏఐసీసీ ఉపాధ్యక్షుడిగా అపాయింట్ అయిన తరువాత సలహాదారుల వ్యవస్థ మొత్తం ధ్వంసమైందని ఆరోపించారు. ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్ను చింపేయడంతోనే రాహుల్ గాంధీకి ఉన్న రాజకీయ పరిజ్ఞానం ఏ పాటిదో అర్థమైందని అన్నారు.
ఆయన రాసిన ఈ లేఖ పట్ల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ స్పందించారు. ఆజాద్ అంటే తనకు చాలా గౌరవం ఉందని, సీనియర్లు సైతం ఆయనను ఎంతో అభిమానిస్తారని అన్నారు. దశాబ్దాల పాటు కొనసాగిన అనుబంధాన్ని తెంచుకుంటారని తాను అనుకోలేదని వ్యాఖ్యానించారు. రాజీనామా చేయడానికి ఆయనకు ఉన్న కారణాలు ఆయనకు ఉండొచ్చని పేర్కొన్నారు.
ఆజాద్ రాజీనామా లేఖను చదివిన తరువాత నోట మాట రావట్లేదని అశోక్ గెహ్లాట్ అన్నారు. పార్టీ ఆయనకు ఎన్నో పదవులను అప్పగించిందని గుర్తు చేశారు. అలాంటి నాయకుడి నుంచి ఇలాంటి లెటర్ వస్తుందని ఊహించలేదని పేర్కొన్నారు. పార్టీ అధినేత్రి సోనియా గాంధీ హెల్త్ చెకప్ కోసం విదేశాలకు వెళ్లిన ప్రస్తుత పరిస్థితుల్లో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. మెడికల్ చెకప్ కోసం వెళ్లే సమయంలోనూ లెటర్ రాశారని గుర్తు చేశారు.
పార్టీ అధిష్ఠానం ఆజాద్కు అన్నీ ఇచ్చిందని, జాతీయ స్థాయిలో గుర్తింపు పొందడానికి ప్రధాన కారణం కాంగ్రెస్ పార్టీయేనని అన్నారు. ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ హయాంలో ఆజాద్ పార్టీలో కీలకంగా వ్యవహరించారని, ఇప్పుడు తీసుకున్న రాజీనామా నిర్ణయాన్ని తాను ఏ మాత్రం అంచనా వేయలేకపోయానని అశోక్ గెహ్లాట్ అన్నారు. లేఖ రాసిన విధానం తనను బాధ కలిగిందని, దానిపై మాట్లాడటానికి నోరు రావట్లేదని చెప్పారు.