గులాం నబీ ఆజాద్ రాజీనామా - సోనియా క్యాంపులో కలకలం: వాట్ నెక్స్ట్..!!
న్యూఢిల్లీ: అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష ఎన్నికల గడువు సమీపిస్తోంది. ఈ నెల 21వ తేదీన దీనికి సంబంధించిన ప్రక్రియ మొదలు కాబోతోంది. సుమారు నెల రోజుల పాటు ఇది కొనసాగుతుంది. సోనియా గాంధీ- ప్రస్తుతం ఏఐసీసీ తాత్కాలిక అధినేత్రిగా వ్యవహరిస్తోన్నారు. ఆమె స్థానంలో పూర్తిస్థాయిలో పార్టీ అధ్యక్షుడిని ఎన్నుకోనుంది కాంగ్రెస్ పార్టీ. ఈ పదవి కోసం రాహుల్ గాంధీ రేసులో నిలిచారా? లేదా? అనే విషయంపై స్పష్టత రాలేదు.
గులాం నబీ ఆజాద్ రాజీనామా..
ప్రస్తుతం దీనికి సంబంధించిన ఏర్పాట్లు కొనసాగుతోన్న వేళ.. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు గులాం నబీ ఆజాద్- తన వైఖరేమిటో స్పష్టం చేశారు. జమ్మూ కాశ్మీర్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఛైర్మన్ పదవికి రాజీనామా చేశారు. ప్రచార కమిటీ ఛైర్మన్గా ఆజాద్ను నియమిస్తూ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఉత్తర్వులు జారీ చేసిన నాలుగైదు గంటల వ్యవధిలోనే ఆయన రాజీనామా చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఆరోగ్య కారణాల వల్ల తాను రాజీనామా చేస్తోన్నట్లు చెప్పారు ఆజాద్.
అసంతృప్తికి..
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుల్లో ఒకరు. కాంగ్రెస్ గ్రూప్- 23లో ఒకరు. జాతీయ స్థాయిలో కాంగ్రెస్లో సంస్థాగత మార్పులను తీసుకుని రావాల్సిన అవసరం ఉందంటూ కొంతకాలంగా డిమాండ్ చేస్తూ వస్తోన్నారు. చాలాకాలంగా అదిష్టానం వైఖరిపై అసంతృప్తితో ఉంటోన్నారు. రాజ్యసభ పదవీ కాలాన్ని పొడగించకపోవడమే దీనికి కారణమనే అభిప్రాయాలు ఉన్నాయి. రాజ్యసభ సభ్యుడిగా పదవీ కాలం ముగిసిన తరువాత పెద్దగా పార్టీలో క్రియాశీలకంగా ఉండట్లేదు.
పీసీసీలో కీలక మార్పులు..
ఈ పరిణామాల మధ్య కాంగ్రెస్ హైకమాండ్- జమ్మూ కాశ్మీర్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీలో పలు మార్పులు చేర్పులు చేపట్టింది. పీసీసీ చీఫ్గా గులాం అహ్మద్ మీర్ను తొలగించింది. ఆయన స్థానంలో వికార్ రసూల్ వణీని అపాయింట్ చేసింది. కార్యనిర్వాహక అధ్యక్షుడిగా రమణ్ భల్లాను నియమించింది. ప్రచార కమిటీతో పాటు పొలిటికల్ ఎఫైర్స్, కోఆర్డినేషన్, మేనిఫెస్టో, పబ్లిసిటీ అండ్ పబ్లికేషన్, డిసిప్లీనరీ, ప్రదేశ్ ఎలక్షన్స్ కమిటీ బాధ్యతలను కొత్తవారికి అప్పగించింది.
క్యాంపెయిన్ కమిటీలో..
11 మంది సీనియర్ నేతలతో ఏర్పాటు చేసిన క్యాంపెయిన్ కమిటీకి గులాం నబీ ఆజాద్ను ఛైర్మన్గా, తారిఖ్ హమీద్ కర్రాను వైస్ ఛైర్మన్గా నియమించింది కాంగ్రెస్ అధిష్ఠానం. అంతా బాగున్నప్పటికీ.. గులాం అహ్మద్ మీర్ తొలగింపు అంశం జమ్మూ కాశ్మీర్ కాంగ్రెస్ కమిటీలో తీవ్ర అసమ్మతి చెలరేగడానికి కారణమైందనే అభిప్రాయాలు ఉన్నాయి. గులాం నబీ ఆజాద్కు అత్యంత ఆప్తుడిగా గులాం అహ్మద్ మీర్కు గుర్తింపు ఉంది.
దూరమౌతారా?
తన రాజ్యసభ సభ్యత్వ పదవీ కాలాన్ని పొడిగించకపోవడం, ప్రధాన అనుచరుడిని పీసీసీ చీఫ్ పదవి నుంచి తొలగించడంతో ఇక ఆజాద్ పార్టీకి పూర్తిస్థాయిలో దూరమౌతారనే ప్రచారం కూడా సాగుతోంది. అధ్యక్ష ఎన్నికలకు ఏఐసీసీ సమాయాత్తమౌతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో గులాం నబీ ఆజాద్ రాజీనామా వ్యవహారం ఎలాంటి పరిణామాలకు దారి తీయవచ్చనేది ఉత్కంఠభరితంగా మారింది. మాజీ ఎమ్మెల్యే హాజీ అబ్దుల్ రషీద్ దర్ ఏకంగా కాంగ్రెస్ పార్టీకే గుడ్బై చెప్పారు. తన ప్రాథమిక సభ్యత్వానికీ రాజీనామా చేశారు.