ఢిల్లీలో చిన్నారి కిరాతకం: హత్యాయత్నం
న్యూఢిల్లీ: భారతదేశ రాజధానిలో షాకింగ్ సంఘటన జరిగింది. కిరాతకానికి ఒడిగట్టిన బాలికను అరెస్టు చేసి చిన్నారుల కేర్ హౌస్ కు తరలించామని పోలీసు అధికారులు తెలిపారు. బుధవారం రాత్రి ఈ సంఘటన జరిగింది. పోలీసు అధికారుల కథనం మేరకు వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
ఢిల్లీలో నివాసం ఉంటున్న బాలిక (11) బుధవారం రాత్రి తన తల్లి పని చేస్తున్న చోటుకు బయలుదేరింది. రాజౌరి గార్డెన్స్ ప్రాంతానికి రాగానే ఒంటరిగా వెలుతున్న మహిళ (71) ను అడ్డుకుంది. తరువాత ఆమె మీద బ్లాక్ పెప్పర్ స్ర్పేని ఆమె కళ్లలోకి కొట్టింది.
కిందపడిన ఆమె మీద పూల కుండి తీసుకుని దాడి చేసింది. తీవ్రగాయాలైన బాధితురాలు దెబ్బలు తట్టుకోలేక గట్టిగా కేకలు వేసింది. అటు వైపు వెలుతున్న వారు విషయం గుర్తించి బాధితురాలిని రక్షించారు. బాలికను పట్టుకుని పోలీసు అధికారులకు సమాచారం ఇచ్చారు.
పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని బాలికను అదుపులోకి తీసుకున్నారు. బాధితురాలిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. చిన్నారి ఉద్దేశపూర్వకంగానే మహిళ మీద దాడి చేసిందని పోలీసు అధికారులు అంటున్నారు. మహిళ దగ్గర ఉన్న విలువైన బంగారు నగలు లాక్కోవడానికి బాలిక ప్రయత్నించి ఉంటుందని అనుమానం వ్యక్తం చేశారు. బాలిక చిన్నారుల కేర్ హౌస్ లో ఉందని, కేసు దర్యాప్తులో ఉందని పోలీసు అధికారులు తెలిపారు.