రాత్రిపూట గదికి వస్తానంది!: ఊహల్లో తేలిన యువకుడికి తేరుకోలేని షాక్..
వచ్చేటప్పుడు వెంట మద్యం బాటిల్స్ కూడా తెచ్చిన యువతి.. తెలివిగా అతన్ని మత్తులో ముంచింది. పీకలదాకా తాగించి..
న్యూఢిల్లీ: ప్రేమగా పలకరించింది.. మెల్లిగా మాటలు కలుపుతూ.. గదికి వచ్చేందుకు కూడా ఓకె చెప్పింది. ఇంకేముంది?.. అదృష్టం తలుపు తట్టిందని ఆ యువకుడు ఎగిరి గంతేశాడు. ఇక ఆ అమ్మాయి రాత్రి తన గదికి రాగానే.. తనను తాను మైమరిచిపోయాడు. ఇదే అదునుగా భావించిన యువతి.. అతనికి తేరుకోలేని షాక్ ఇచ్చింది.
వివరాల్లోకి వెళ్తే.. న్యూఢిల్లీలోని మానససరోవర్ గార్డెన్ కు చెందిన ఓ యువకుడి(23)కి ఇటీవల ఓ అమ్మాయితో ఫోన్ ద్వారా పరిచయం ఏర్పడింది. రోజురోజుకు ఇద్దరి మధ్య సాన్నిహిత్యం మరింత పెరిగి.. ఏకంగా అతని గదికి వచ్చేందుకు యువతి ఓకె చెప్పింది. అయితే వచ్చేటప్పుడు వెంట మద్యం బాటిల్స్ కూడా తెచ్చిన యువతి.. తెలివిగా అతన్ని మత్తులో ముంచింది.
పీకలదాకా తాగించి.. అతను నిద్రలోకి జారుకున్నాక డబ్బు, విలువైన వస్తువులతో ఉడాయించింది. ఐ ఫోన్, రూ.12వేల నగదు, ద్విచక్రం వాహనంతో ఆమె పరారైంది. తెల్లారి లేచి తాను మోసపోయానని తెలుసుకున్న యువకుడు.. పోలీసులను ఆశ్రయించి జరిగిందంతా చెప్పాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. ఆ మాయలేడీని గుర్తించారు.
సీసీటివి ఫుటేజీ, ఐఫోన్ సిగ్నల్స్ ఆధారంగా.. ఆమె రఘుబీర్ నగర్ ప్రాంతంలో ఉందని తేల్చారు. ఆపై ఇంటింటికి తనిఖీలు చేసి ఎట్టకేలకు ఆమెను పట్టుకున్నారు. నిందితురాలి నుంచి ఐ ఫోన్ తో పాటు, ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నారు. యువతి చదివింది 10వ తరగతే అయినా.. ఇంగ్లీషులో అనర్గళంగా మాట్లాడే నేర్పుతో చాలామందిని బోల్తా కొట్టిస్తోందని తెలిపారు.