ఉత్తరప్రదేశ్లో మరో దారుణం... కదులుతున్న కారులో యువతిపై గ్యాంగ్ రేప్... ముగ్గురి అరెస్ట్...
ఉత్తరప్రదేశ్లో మరో దారుణం జరిగింది. కదులుతున్న కారులో ఓ టీనేజ్ యువతిపై ముగ్గురు గ్యాంగ్ రేప్కి పాల్పడ్డారు. ఆ తతంగాన్ని సెల్ఫోన్లో చిత్రీకరించి... విషయం బయటకు పొక్కవద్దని బాధితురాలిని బెదిరించారు. అంతేకాదు,బాధితురాలు ఎక్కడ పోలీస్ స్టేషన్కి వెళ్లి ఫిర్యాదు చేస్తుందోనని ఆమె ఇంటికి వెళ్లి మరీ వార్నింగ్ ఇచ్చారు. పోలీసులకు ఫిర్యాదు చేస్తే తల్లిదండ్రులను చంపేస్తామని భయభ్రాంతులకు గురిచేశారు. నిందితుల బెదిరింపులకు వెరవని ఆ బాధితురాలు ఎట్టకేలకు పోలీసులను ఆశ్రయించడంతో ఈ ఘటన వెలుగుచూసింది.
అసలేం జరిగింది...
గ్యాంగ్ రేప్ ఘటనపై బాధితురాలు ఆదివారం(డిసెంబర్ 6) బులంద్ షహర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి కథనం ప్రకారం... డిసెంబర్ 3న ఏదో పని నిమిత్తం ఆమె ఇంటి నుంచి బయటకు వెళ్లింది. మార్గమధ్యలో ఓ కారులో వచ్చిన ముగ్గురు వ్యక్తులు ఆమెను అడ్డగించి బలవంతంగా కారులో ఎక్కించారు. అనంతరం కదులుతున్న కారులోనే ఆమెపై గ్యాంగ్ రేప్కి పాల్పడ్డారు. ఆ అఘాయిత్యాన్ని తమ సెల్ఫోన్లలో వీడియో కూడా చిత్రీకరించారు. రేప్ గురించి ఎవరికైనా చెప్తే ప్రాణాలు దక్కవని బెదిరించారు.
ఇంటికి వెళ్లి మరీ బెదిరించారు...
రేప్ ఘటనను ఎవరికీ చెప్పుకోలేక బాధితురాలు తనలో తానే కుమిలిపోయింది. ఇదే క్రమంలో నిందితులు శుక్రవారం(డిసెంబర్ 4) ఆమె ఇంటికి వచ్చారు. అత్యాచార ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేస్తే నీ తల్లిదండ్రులను చంపేస్తామని ఆమె బెదిరించారు. బాధితురాలు ఎట్టకేలకు ధైర్యం చేసి తన తల్లిదండ్రులకు జరిగిన విషయం చెప్పింది. వారి సహాయంతో బులంద్ షహర్ పోలీస్ స్టేషన్కి వెళ్లి నిందితులపై ఫిర్యాదు చేసింది.
నిందితుడి తండ్రికి,బాధితురాలి తల్లికి వివాదం...
బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితులపై ఐపీసీ సెక్షన్స్ 376,354లతో పాటు పోక్సో చట్టం కింద కేసులు నమోదయ్యాయి. ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. బాధితురాలి ఫిర్యాదుపై పోలీసులు మాట్లాడుతూ... 'బాధితురాలి తల్లి స్థానికంగా వడ్డీ వ్యాపారం చేస్తుంటుంది. బాధితురాలిపై అత్యాచారానికి పాల్పడ్డ నిందితుల్లో ఒకరి తండ్రికి ఇటీవల ఆమె రూ.30వేలు రుణం ఇచ్చింది. అయితే ఇందుకోసం రూ.2వేలు కమిషన్ అడగ్గా... ఆ వ్యక్తి అందుకు నిరాకరించాడు. దీంతో బాధితురాలి తల్లికి,ఆ వ్యక్తికి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. బహుశా ఈ వివాదాన్ని దృష్టిలో పెట్టుకునే అతని కొడుకు స్నేహితులతో కలిసి ఆమెపై గ్యాంగ్ రేప్కి పాల్పడ్డాడా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నాం.' అని పోలీసులు తెలిపారు.
Recommended Video
హత్రాస్ మరవకముందే మరెన్నో ఘటనలు...
ఉత్తరప్రదేశ్లో మహిళలపై అత్యాచార ఘటనలు నిత్యకృత్యం అయిపోయాయి. ప్రతీరోజూ రాష్ట్రంలో ఎక్కడో చోట మహిళలపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. ఇటీవల హత్రాస్లో ఓ దళిత యువతిపై అగ్ర కులాలకు చెందిన యువకులు గ్యాంగ్ రేప్కి పాల్పడిన విషయం తెలిసిందే. నిందితులు ఆమె నాలుకను కూడా కోసేశారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించిన ఆ యువతి మృతదేహాన్ని తల్లిదండ్రులకు అప్పగించకుండా రాత్రికి రాత్రి పోలీసులే దహనం చేశారు. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా తీవ్ర నిరసన వ్యక్తమైంది.