అమ్మాయిలు ప్యాంట్ ధరిస్తే రోగాలే, పురుషుల్లా మారుతారు, సల్వార్ కమీజ్ లే ధరించాలి
మహిళలు ప్యాంట్ ధరిస్తే రోగాలకు గురౌతారని ముంబై ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీ ప్రిన్సిఫాల్ స్వాతి దేశ్ పాండే చెప్పారు. సల్వార్ కమీజ్ లనే ధరించాలని ఆమె సూచించారు.
ముంబై : అమ్మాయిలు ప్యాంట్ , షర్ట్ ధరిస్తే వ్యాధుల బారిన పడుతారని, అందుకే వారంతా సల్వార్ కమీజ్ లు వేసుకోవాలని ముంబైలోని బాంద్రా ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీ ప్రిన్సిఫాల్ స్వాతి దేశ్ పాండే సూచించారు.
అమ్మాయిలు ప్యాంట్ ,షర్ట్ ధరిస్తే పాలిసిస్టిక్ ఒవేరియన్ సిండ్రోమ్ సంక్రమిస్తుందని ఆమె హెచ్చరించారు. ఆడ పిల్లలకు చిన్న వయసులోనే ఇటువంటి వ్యాధులు ఎందుకు వస్తున్నాయో తెలిపే అనేక వాదనలను తాను విన్నానని తెలిపారు.
పురుషుల మాదిరిగా దుస్తులు ధరించే బాలికలు పురుషుల్లాగానే ప్రవర్తించడం మొదలెడతారని, వారి మనసులో ఆలోచనలు వ్యతిరేక దిశలో ఉంటాయన్నారు. దీనివల్ల పునరుత్పాదనకోసం సహజమైన ఆకాంక్ష చిన్న వయసులోనే క్షీణిస్తుందన్నారు. స్త్రీ సంబంధ రోగాలకు ఇదే కారణమని తెలిపారు.
క్యాంటీన్లో తాడు కట్టి ఓ వైపు విద్యార్థులు, మరో వైపు విద్యార్థినులు ఉండేలా చర్యలు తీసుకోవాలని, అప్పుడే క్యాంపస్లో లైంగిక వేధింపులు ఆగిపోతాయని ఆమె అభిప్రాయపడ్డారు.
విద్యార్థినులకు తగిన యూనిఫారం కోసం పరిశీలన జరుపుతున్నట్టుగా ఆమె చెప్పారు. సల్వార్ కమీజ్ అయితే విద్యార్థినులను మానసిక, హార్మోనుల సంబంధిత అసమతుల్యత నుంచి కాపాడవచ్చునని ఆమె అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
అయితే ఈ అభిప్రాయాలతో నిపుణులు ఏకీభవించడం లేదు. సల్వార్ కమీజ్ ధరిస్తే ల్యాబ్లో ఇబ్బందులొస్తాయని విద్యార్థినులు అంటున్నారని కమిటీ సభ్యులు చెబుతున్నారు.