Delhi riots: అల్లర్లపై అర్ధరాత్రి ఢిల్లీ హైకోర్టు జడ్జి నివాసంలో విచారణ: పోలీసులకు కీలక ఆదేశాలు.. !
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా అమలు చేయడానికి ఉద్దేశించిన పౌరసత్వ సవరణ చట్టానికి నిరసనగా ఆందోళనకారులు చేపట్టిన వ్యతిరేక ప్రదర్శనలను కేంద్రబిందువుగా చేసుకుని రెండు రోజులుగా కొనసాగుతున్న అల్లర్లతో ఈశాన్య ఢిల్లీ అట్టుడికిపోతోంది. దాడులు, ప్రతిదాడులతో అతలాకుతలంగా మారింది. ఈశాన్య ఢిల్లీలోని జఫ్రాబాద్, మౌజ్పూర్లల్లో అంటుకున్న మంటలు పొరుగు ప్రాంతాలకు వ్యాపించాయి. 13 మంది మరణానికి దారి తీశాయి.

ఢిల్లీ హైకోర్టు నివాసంలో విచారణ..
ఇలాంటి పరిణామాల మధ్య అల్లర్లలో గాయపడ్డ వారికి అత్యవసర వైద్య సహాయాన్ని అందించడానికి దాఖలు చేసిన పిటీషన్పై ఢిల్లీ హైకోర్టు అత్యవసర విచారణను నిర్వహించింది. బుధవారం తెల్లవారు జామున 1:42 నిమిషాల్లో ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎస్ మురళీధర్ అధికారిక నివాసంలో ఈ విచారణ కొనసాగింది. జస్టిస్ ఎస్ మురళీధర్, జస్టిస్ ఏజే భంభానిలతో కూడిన ఇద్దరు న్యాయమూర్తుల ధర్మాసనం విచారణ చేపట్టింది.

క్షతగాత్రులకు మెరుగైన వైద్య చికిత్స కోసం..
కొందరు డాక్టర్లతో కూడిన ప్రతినిధుల బృందం దాఖలు చేసిన పిటీషన్ అది. అల్లర్లలో తీవ్రంగా గాయపడిన కొందరు క్షతగాత్రులను మెరుగైన చికిత్స కోసం గురు తేజ్ బహదూర్ ఆసుపత్రికి తరలించడానికి వీలు కల్పించాలని, దారి వదిలేలా ఢిల్లీ పోలీసులను ఆదేశించాలంటూ కొందరు డాక్టర్లు హైకోర్టును ఆశ్రయించారు. ఈశాన్య ఢిల్లీలోని ముస్తఫబాద్లో గల అల్ హింద్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని గురు తేజ్ బహదూర్ ఆసుపత్రికి అత్యవసరంగా తరలించాల్సి ఉందని పేర్కొన్నారు.

ఢిల్లీ పోలీసులు అడ్డుకుంటున్నారంటూ..
అత్యవసర పరిస్థితి అయినప్పటికీ.. ఢిల్లీ పోలీసులు అడ్డుకుంటున్నారనే విషయాన్ని వారు న్యాయమూర్తుల దృష్టికి తీసుకెళ్లారు.తరలింపులో ఏ మాత్రం ఆలస్యం చోటు చేసుకున్నప్పటికీ.. ప్రాణాపాయం తప్పదని తమ పిటీషన్లో పేర్కొన్నారు. ఈ పిటీషన్పై విచారించడానికి ఇద్దరు న్యాయమూర్తులతో కూడిన ఢిల్లీ హైకోర్టు ధర్మాసనం.. అర్ధరాత్రి దాటిన తరువాత అత్యవసరంగా విచారణ చేపట్టింది. ఢిల్లీ పోలీసులకు కీలక ఆదేశాలను జారీ చేసింది.
Recommended Video


ఢిల్లీ హైకోర్టు ఆదేశించినా..
ఒక వర్గానికి చెందిన క్షతగాత్రులను సురక్షితంగా గురు తేజ్ బహదూర్ ఆసుపత్రికి తరలించడాన్ని అడ్డుకోవద్దని ఢిల్లీ పోలీసులను ఆదేశించింది. అవసరమైతే క్షతగాత్రుల తరలింపులో సహకరించాలని కూడా సూచించింది. ఢిల్లీ పోలీసులకు కొన్ని కీలక సూచలను సూచిస్తూ మూడు పేజీల తీర్పు పాఠాన్ని వినిపించింది. ఢిల్లీ హైకోర్టు ఆదేశాలను జారీ చేసినప్పటికి కూడా పోలీసులు వాటిని పట్టించుకోవట్లేదనే ఆరోపణలు ఉన్నాయి. తెల్లవారు జామున 4 గంటల వరకు కూడా ముస్తఫబాద్ ఆసుపత్రి నుంచి క్షతగాత్రులను తరలింపు కుదరలేదని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications