గోవా బీచ్ లో బీజేపీ పాగా: నరేంద్ర మోడీనా మజాకా, ఎగ్జిట్ పోల్స్
గోవాలో జరిగిన శాసన సభ ఎన్నికల్లో బీజేపీ మళ్లీ అధికారంలోకి వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని ఎగ్జిట్ పోల్ సర్వేలు చెబుతున్నాయి.
గోవా: గోవాలో జరిగిన శాసన సభ ఎన్నికల్లో బీజేపీ మళ్లీ అధికారంలోకి వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని ఎగ్జిట్ పోల్ సర్వేలు చెబుతున్నాయి. పర్యాటక ప్రాంతం అయిన గోవాలో మరో సారి బీజేపీ తన హవా సాగించిందని ఎగ్జిట్ పోల్ సర్వేలు చెబుతున్నారు.
గురువారం సాయంత్రం విడుదలైన ఎగ్జిట్ పోల్స్ సర్వేల్లో బీజేపీ ఆధిక్యంలో ఉంది. ఎన్ డీ టీవీ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం గోవాలో బీజేపీకి 15 నుంచి 21 స్థానాలు, కాంగ్రెస్ కు 12 నుంచి 18 స్థానాలు, అమ్ ఆద్మీ పార్టీకి 0 నుంచి 4 స్థానాలు వచ్చే అవకాశం ఉంది.
సీఎన్ఎన్ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం బీజేపీకి 18 స్థానాలు, కాంగ్రెస్ కు 10 స్థానాలు, అమ్ ఆద్మీ పార్టీకి 7 స్థానాలు, ఇతరులకు 8 స్థానాలు వచ్చే అవకాశం ఉందని తెలిపింది. ఇండియా టుడే ఎగ్జిట్ పోల్స్ మాత్రం బీజేపీనే మళ్లీ అధికారంలోకి వస్తుందని కచ్చితంగా వెల్లడించింది.
ఇండియా టుడే, మై ఆక్సిస్ సర్వే ఎగ్జిట్ పోల్స్ ప్రకారం బీజేపీకి 23 నుంచి 27 స్థానాలు, కాంగ్రెస్ కు 12 నుంచి 14 స్థానాలు, అమ్ ఆద్మీ పార్టీకి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని వెల్లడించింది. ఇదే సమయంలో అనేక సర్వేలు బీజేపీనే మళ్లీ గోవాలో అధికారంలోకి వస్తుందని స్పష్టం చేశాయి. గోవాలో మొత్తం 40 సీట్లు ఉన్నాయి. ఏ పార్టీ అయినా అధికారంలోకి రావాలంటే కచ్చితంగా 21 సీట్లలో విజయం సాధించాలి.