Goa elections: ఎన్నికలకు ముందు బీజేపీకి షాక్; గోవా మంత్రి పదవికి మైఖేల్ లోబో రాజీనామా
గోవా ఎన్నికల సమయంలో అధికార బీజేపీకి షాక్ తగిలింది. గోవా మంత్రి మైఖేల్ లోబో రాష్ట్రంలో ఎన్నికలకు కేవలం ఒక నెల ముందు సోమవారం నాడు రాజీనామా చేశారు. ఇకపై సామాన్యుల పార్టీ కాదు అని తాను బిజెపిని విడిచిపెట్టానని ఆయన పేర్కొన్నారు. గత కొన్నేళ్లుగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అధికార పార్టీలోకి చేరుతున్న తీరును తిప్పికొడుతూ ఆయన కాంగ్రెస్లోకి వెళ్లే అవకాశం ఉందని గోవా రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది.

బీజేపీకి షాక్ .. గోవా మంత్రి రాజీనామా
రాజీనామా అనంతరం మైఖేల్ లోబో మాట్లాడుతూ తాను రెండు మంత్రి, ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేశానని వెల్లడించారు. బీజేపీకి కూడా రాజీనామా చేశానని రాష్ట్ర వ్యర్థ పదార్థాల నిర్వహణ శాఖ మంత్రి మైఖేల్ లోబో విలేకరులతో అన్నారు. బీజేపీ సామాన్య ప్రజల పార్టీ కాదని ఓటర్లు తనతో చెప్పారని, అందుకే తాను రాజీనామా చేశానని ఆయన తన రాజీనామా ఎత్తుగడను సమర్థించుకున్నారు. తాను ఏ పార్టీలో చేరుతున్నానో క్లారిటీ ఇవ్వని ఆయన పార్టీలతో చర్చలు జరుపుతున్నామని వెల్లడించారు. కాంగ్రెస్లో చేరే విషయంపై ఆయన స్పష్టత ఇవ్వలేదు. నేను ఏ పార్టీలో చేరినా గరిష్ట సీట్లు గెలుపొందడం ఖాయమని ఆయన పేర్కొన్నారు

బీజేపీపై విమర్శలు గుప్పిస్తున్న గోవా మంత్రి మైఖేల్ లోబో
మైఖేల్ లోబో ఇటీవల కాలంలో బిజెపిని బహిరంగంగా విమర్శిస్తున్నాడు. ఇది మాజీ ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ నిర్మించిన పార్టీ కాదని అన్నారు. 2019లో మనోహర్ పారికర్ మరణానంతరం ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ప్రమోద్ సావంత్తో ఆయనకు బహిరంగంగా విభేదాలు వచ్చాయి. బీజేపీని భిన్నత్వం ఉన్న పార్టీ అని పిలుస్తారు కానీ అది భిన్నత్వం ఉన్న పార్టీ కాదని ఈ మధ్యనే తెలిసింది. పార్టీ కార్యకర్తలకుఇప్పుడు పార్టీలో ప్రాముఖ్యత లేదు అని లోబో గత నెలలో చెప్పినట్లు వార్తలు వచ్చాయి.

గోవాలోని బర్దేశ్లో పార్టీపై మైఖేల్ లోబో రాజీనామా ప్రభావం
మనోహర్ పారికర్కు సన్నిహితంగా ఉండే నేతలను పార్టీలో పక్కన పెడుతున్నారని ఆయన అన్నారు. మైఖేల్ లోబో రాజీనామా గోవాలోని బర్దేశ్లో పార్టీపై ప్రభావం చూపవచ్చునని సమాచారం. ఆయన సొంత నియోజకవర్గం కలంగుటేతో సహా ఆరు అసెంబ్లీ స్థానాలు బర్దేశ్ పరిధిలో ఉన్నాయి. తాజా రాజీనామాతో 40 మంది సభ్యులున్న గోవా అసెంబ్లీలో బీజేపీ బలం 24కి తగ్గనుంది. ఆదివారం, కలంగుటే సమీపంలోని నియోజకవర్గమైన సాలిగావ్ నుండి కాంగ్రెస్ అభ్యర్థి ప్రచారాన్ని ప్రారంభించిన సందర్భంగా లోబో అక్కడ కనిపించినట్టు సమాచారం.

తన భార్య డెలీలాకి టికెట్ ఆశించిన మైఖేల్ లోబో
నివేదికల ప్రకారం, మైఖేల్ లోబో తన భార్య డెలీలాకి కూడా టికెట్ ఆశిస్తున్నాడు. సియోలిమ్ నియోజకవర్గం నుంచి డెలిలా లోబోను పోటీకి దింపేందుకు బీజేపీ ఆసక్తి చూపించకపోవటంతో ఆయన కాంగ్రెస్ బాట పట్టనున్నారని సమాచారం. గోవా కొత్త అసెంబ్లీకి ఫిబ్రవరి 14న ఎన్నికలు జరగనున్నాయి. గోవాతో పాటు మరో నాలుగు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు మార్చి 10న వెల్లడికానున్నాయి.
Recommended Video

గోవాలో ఎన్నికల రాజకీయం .. పార్టీ ఫిరాయింపులు
గోవాలో బీజేపీ, కాంగ్రెస్, గోవా ఫార్వర్డ్ పార్టీ (GFP), మహారాష్ట్రవాదీ గోమంతక్ పార్టీ (MGP), ఆమ్ ఆద్మీ పార్టీ (AAP), తృణమూల్ కాంగ్రెస్ మరియు నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP) ప్రధాన పార్టీలు పోటీ చేస్తున్నాయి. హోరాహోరీగా ఈ దఫా గోవా ఎన్నికలు కొనసాగనున్నాయి. ఇప్పటికే పార్టీ ఫిరాయింపులతో గోవాలో రసవత్తర రాజకీయం చోటు చేసుకుంది.












Click it and Unblock the Notifications