12.30 లక్షలమంది రైల్వే ఉద్యోగులకు మోడీ ప్రభుత్వం తీపివార్త
రైల్వే ఉద్యోగులకు శుభవార్త. ఈ ఏడాది దసరా - దీపావళి బోనస్ కింద 78 రోజుల వేతనాన్ని అందుకోనున్నారు. 78 రోజుల ఉత్పాదకత ఆధారిత బోనస్గా ఈ మొత్తాన్ని అందిస్తారు.
న్యూఢిల్లీ: రైల్వే ఉద్యోగులకు శుభవార్త. ఈ ఏడాది దసరా - దీపావళి బోనస్ కింద 78 రోజుల వేతనాన్ని అందుకోనున్నారు. 78 రోజుల ఉత్పాదకత ఆధారిత బోనస్గా ఈ మొత్తాన్ని అందిస్తారు.
ఈ మేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన కేంద్రమంత్రివర్గ సమావేశంలో బుధవారం నిర్ణయం తీసుకున్నారు.
దసరా, దీపావళి పండుగల నేపథ్యంలో 12.30 లక్షల మంది నాన్ గెజిటెడ్ రైల్వే ఉద్యోగులకు 2016-17కుగాను 78 రోజుల వేతనాన్ని బోనస్గా అందజేస్తారు. ఒక్కొక్కరికి రూ.7,000 వంతున మంజూరు చేయనున్నారు. అర్హత కలిగిన ఉద్యోగి అదికంగా రూ.17,951 పొందుతారు. మొత్తం ఉద్యోగులకు రూ.2,245.45 కోట్ల రూపాయలు అవుతుంది.
భారతీయ రైల్వే ప్రజల కోసం పని చేస్తుందని మంత్రిత్వ శాఖ చెప్పింది. ఈ బోనస్ మరింత సమర్థవంతంగా పని చేసేందుకు, మరింత ఉత్సాహంగా పని చేసేందుకు ఉపయోగపడుతుందని అభిప్రాయపడింది.
కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ మాట్లాడుతూ.. 2016-17 ఏడాదికిగాను నాన్ గెజిటెడ్ ఉద్యోగులకు 78 రోజుల ఉత్పాదక ఆధారిత బోనస్కు మంత్రిమండలి ఓకే చెప్పిందన్నారు.