ముండే మృతి:మోడీ దిగ్భ్రాంతి, బాబు, కెసిఆర్ సంతాపం
న్యూఢిల్లీ: కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి గోపినాథ్ ముండే దుర్మరణం గురించి తెలిసిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దిగ్భ్రాంతికి లోనయ్యారు. ముండే మృతి విషయం తెలియగానే మోడీ ట్విట్టర్లో స్పందించారు. ముండే నిజమైన ప్రజా నాయకుడు అని, అతని మృతి దేశానికి, ప్రభుత్వానికి తీరని లోటు అన్నారు.
వెనుకబడిన వర్గాల ప్రతినిధిగా ముండే సేవలు మరువలేనివి అన్నారు. అతను ప్రజా నాయకుడు అన్నారు. ముండే కుటుంబ సభ్యులకు మోడీ తన ప్రగాడ సానుభూతిని తెలియజేశారు. తాము వారికి అండగా నిలబడతామని చెప్పారు.
పలువురి సంతాపం
గోపినాథ్ ముండే మృతి పట్ల రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తన సంతాపాన్ని వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు సంతాపం తెలిపారు. టిడిపి అధ్యక్షులు, కాబోయే ఎపి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంతాపం తెలిపారు. ముండే మృతి దేశానికి, బిజెపికి ఎన్డీయేకు తీరని లోటు అన్నారు.
రేపు అంత్యక్రియలు
రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖమంత్రి గోపినాథ్ ముండే అంత్యక్రియలు మహారాష్ట్రలోని ఆయన స్వగ్రామం పరాలీలో రేపు జరుగుతాయని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ చెప్పారు. గోపినాథ్ ముండే మృతి బాధాకరమని మరో కేంద్రమంత్రి హర్షవర్ధన్ అన్నారు. ప్రధానికి సమాచారం అందించినట్లు చెప్పారు.