ఆలయాల్లో మహిళా అర్చకులు, జయ శిక్షపై: సీఎం సిద్దు
న్యూఢిల్లీ: కర్ణాటక ప్రభుత్వ ఆలయాల్లో ఇక నుంచి పూజల నిర్వహణకు మహిళా అర్చకులను కూడా నియమించాలని యోచిస్తున్నారు. కడ్రోలీ శ్రీగోకర్ణనాథేశ్యర ఆలయంలో మంగుళూరు దసరా ఉత్సవాలను ప్రారంభించిన ముఖ్యమంత్రి సిద్దరామయ్య మాట్లాడుతూ దేవాదాయశాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న ఆలయాల్లో మహిళా అర్చకులను నియమించాలన్న ప్రతిపాదనలకు భక్తులంతా సహకరిస్తారన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. మంగుళూరు దసరా ఉత్సవాలు కూడా మైసూరు దసరా ఉత్సవాల్లా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవాలని అన్నారు.
కర్ణాటక ప్రభుత్వానికి ఏ సంబంధం లేదు: సీఎం సిద్దరామయ్య
తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు పరప్పన అగ్రహార ప్రత్యేక కోర్టు విధించిన జైలు శిక్షకు కర్ణాటక ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని స్ఫష్టం చేశారు. బెంగుళూరులోని విధానసౌధ వద్ద యువత సైకిల్ జాబితాను ఆదివారం జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించిన తర్వాత విలేకరులతో మాట్లాడారు.
జయలలిత శిక్షకు కారణం కర్ణాటకే అంటూ వస్తున్న వదంతులను నమ్మవద్దని సూచించారు. "కోర్టులు ఇచ్చిన తీర్పును రాష్ట్ర ప్రభుత్వం పాటిస్తుంది. ఇందులో ఇతరుల జోక్యం ఉండదు. లేని పోని వదంతుల్ని ప్రచారం చేసి శాంతిభద్రతల్ని దెబ్బతీయడం సరికాదు " అని అన్నారు.