గుడ్ న్యూస్: అడ్రస్ ప్రూఫ్ లేకపోయినా 5 కిలోల గ్యాస్ సిలిండర్
కేంద్ర ప్రభుత్వం వలస కార్మికులు, రోజువారీ వేతన జీవులకు తీపి కబురు అందించింది. అంతర్జాతీయంగా ఇంధన సంక్షోభం పొంచి ఉన్న వేళ, సామాన్యుడి వంట గదిలో మంట ఆరకుండా చూసేందుకు మోదీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా సొంత ఊరు విడిచి ఇతర రాష్ట్రాల్లో పొట్టకూటి కోసం నివసిస్తున్న వారికి గ్యాస్ సిలిండర్ల లభ్యతను సులభతరం చేస్తూ కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది.
దేశవ్యాప్తంగా ఉన్న వలస కార్మికుల ఇంధన కష్టాలను తీర్చేందుకు కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ సోమవారం రాత్రి ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రాలకు కేటాయించే 5-కిలోల ఉచిత వాణిజ్య LPG (FTL) సిలిండర్ల కోటాను ప్రభుత్వం ఏకంగా రెట్టింపు చేసింది. మార్చి 2026 నాటి గణాంకాల ఆధారంగా, గతంలో ఉన్న 20% పరిమితిని సడలించి సరఫరాను పెంచాలని నిర్ణయించింది.

అడ్రస్ ప్రూఫ్ అక్కర్లేదు.. ఐడీ కార్డు ఉంటే చాలు!
గతంలో గ్యాస్ కనెక్షన్ తీసుకోవాలంటే స్థానిక చిరునామా రుజువు (Address Proof) తప్పనిసరిగా ఉండేది. దీనివల్ల వలస కార్మికులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడేవారు. ఇప్పుడు ఆ నిబంధనను ప్రభుత్వం పూర్తిగా తొలగించింది.
- ఎవరు పొందవచ్చు?: వలస కార్మికులు, రోజువారీ వేతన జీవులు, హాస్టళ్లలో ఉండే విద్యార్థులు మరియు బ్యాచిలర్ నిపుణులు.
- ఏం కావాలి?: ఏదైనా ఒక గుర్తింపు కార్డు (ID Card), నివాస స్థల వివరాలు మరియు ఆ సిలిండర్ను కేవలం వంటకు మాత్రమే వాడుతున్నామనే 'స్వీయ ధృవీకరణ' (Self-Declaration) పత్రం ఉంటే సరిపోతుంది.
సమీప డీలర్ను సంప్రదించవచ్చు
ఈ పథకం కింద 5 కిలోల సిలిండర్లను రాష్ట్ర ప్రభుత్వాల పౌరసరఫరాల శాఖల ద్వారా పంపిణీ చేస్తారు. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల (OMC) సహకారంతో ఈ ప్రక్రియ సాగుతుంది. శాశ్వత చిరునామా లేని వారు సైతం ఎటువంటి పాలనాపరమైన అడ్డంకులు లేకుండా వంట గ్యాస్ను పొందేలా ఆల్ ఇండియా LPG డిస్ట్రిబ్యూటర్స్ ఫెడరేషన్ ఈ నిర్ణయాన్ని ఆహ్వానించింది. అయితే, ఇవి కేవలం గృహ అవసరాలకు మాత్రమేనని, వాణిజ్య పరంగా వాడకూడదని అధికారులు స్పష్టం చేశారు.
అంతర్జాతీయ ఉద్రిక్తతల వేళ ముందస్తు జాగ్రత్త
పశ్చిమ ఆసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ఫిబ్రవరిలో ఇరాన్పై దాడులు ప్రారంభమైనప్పటి నుండి అంతర్జాతీయ చమురు సరఫరాలో 20% వాటా ఉన్న 'హార్ముజ్ జలసంధి'ని టెహ్రాన్ నిలిపివేసింది. ఈ నేపథ్యంలో దేశంలో ఇంధన కొరత రాకుండా, ముఖ్యంగా పేద వర్గాలకు ఇబ్బంది కలగకుండా కేంద్రం ముందస్తుగా ఈ ఏర్పాట్లు చేస్తోంది. దేశంలో తగినంత ఇంధన నిల్వలు ఉన్నాయని, ఎవరూ భయాందోళనతో కొనుగోళ్లు (Panic Buying) చేయవద్దని ప్రభుత్వం భరోసా ఇచ్చింది.












Click it and Unblock the Notifications