ఎన్నికల ప్రచారంలో ‘విరాట్ కోహ్లీ’: అనుకున్నదొక్కటి.. అయ్యిందొక్కటి!
న్యూఢిల్లీ: పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసిన ఓ అభ్యర్థి ఆ గ్రామ ప్రజలను అయోమయానికి గురిచేశారు. తన కోసం ప్రచారం చేసేందుకు ఏకంగా భారత క్రికెటర్ విరాట్ కోహ్లీ వస్తున్నాడని ఊరంతా పోస్టర్లు అంటించాడు. దీంతో ఆ గ్రామ ప్రజలతోపాటు పక్క గ్రామాల ప్రజలు కూడా కోహ్లీ వస్తున్నాడని ఆశగా ఎదురుచూశారు.
అయితే, తీర చూస్తూ ఆ అభ్యర్థి ఓ డూప్లికేట్ విరాట్ కోహ్లీని తీసుకొచ్చి వారందర్నీ తీవ్ర నిరాశకు గురిచేశాడు. కోహ్లీ అని ప్రచారం చేసి ఇలా చేస్తారా? అంటూ సదరు అభ్యర్థిపై గ్రామస్తులు మండిపడ్డారు. అయితే, కొందరు ఆ డూప్ కోహ్లీతోనూ ఫొటోలు దిగడం గమనార్హం. ఈ ఘటన మహారాష్ట్రలో చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళితే.. విఠల్ గణపత్ అనే వ్యక్తి మహారాష్ట్రలోని రామ్ లింగా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్గా పోటీ చేస్తున్నాడు. మే 25న నిర్వహించే ఎన్నికల ర్యాలీకి విరాట్ కోహ్లీని అతిథిగా తీసుకొస్తానని ఓటర్లకు హామీ ఇచ్చాడు విఠల్. ఆ వాగ్దానంతో ఆ ఊరిలో ఓ రేంజ్లో హడావుడి మొదలైంది. ఊరంతా కోహ్లీ, విఠల్ కలిసున్న బ్యానర్లు వెలిశాయి.
తీరా ఆరోజు రానే వచ్చింది. దీంతో సమావేశం జరిగే స్థలానికి కోహ్లీని చూడాలని జనం ఎంతో ఉత్సాహంగా తరలివచ్చారు. యవత సెల్ఫీలు తీసుకోవడానికి సిద్ధమయ్యారు. అనుకున్నట్టుగానే అతిథి వచ్చాడు. కానీ అతడిని చూడగానే అందరి మొహాల్లో సంతోషం స్థానంలో నిరాశ, నిస్సత్తువ అలుముకుంది.

విరాట్ కోహ్లీలా ఉండే ఒక వ్యక్తిని ఎన్నికల ప్రచారానికి తీసుకొచ్చి విఠల్ ప్రజలను మోసం చేశాడని పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే, ఓ వ్యక్తి ఫొటోతో సహా విషయాన్ని ట్విట్టర్లో పోస్ట్ చేయడంతో ఒక్కసారిగా ఈ విషయం వైరల్గా మారింది.
గాయంతో బాధపడుతున్నప్పటికీ విరాట్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నాడని ఒకరు, నా నవ్వు ఆపుకోలేకపోతున్నాని మరొకరు.. ఇదేం బాలేదంటూ ఒంకొందరు నెటిజన్లు తమ అభిప్రాయాలను వెలిబుచ్చారు.












Click it and Unblock the Notifications