ఆర్మీ వాహనంపై టెర్రరిస్టుల దాడి - గురి తప్పి జనంలో పేలిన గ్రెనేడ్ - కాశ్మీర్లోని బారాబుల్లాలో ఘటన
కొంతకాలం ప్రశాంతంగా ఉన్న జమ్మూకాశ్మీర్ లో మళ్లీ అలజడులు పురివిప్పుతున్నాయి. బాంబులు, తుపాకులు చేతబట్టిన టెర్రరిస్టులు వరుసగా మూడు రోజులు వివిధ ప్రాంతాల్లో భారత బలగాలపై దాడికి ప్రయత్నించాయి. సోమవారం నాటి తాజా ఘటనలో ఆర్మీ వాహనంపై గ్రెనేడ్ దాడికి యత్నిచగా, గురి తప్పి అది జనం మధ్యలో పేలిపోయింది. దీనికి సంబంధించి జమ్మూకాశ్మీర్ పోలీసులు చెప్పిన వివరాలివి..
పోయేముందు నిప్పురాజేసిన ట్రంప్.. కాశ్మీర్, సీఏఏ, ఢిల్లీ హింసపై కామెంట్లు.. మరోసారి పాక్కు సమర్థన
ఉత్తరకాశ్మీర్ లో పాకిస్తాన్ సరిహద్దును ఆనుకుని ఉండే బారాముల్లా జిల్లాలో సోమవారం అనూహ్య ఘటన జరిగింది. బారాముల్లా జిల్లా కేంద్రంలోని ఆజాద్ గంజ్ ప్రాంతంలో ఆర్మీ వాహనాన్ని లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు గ్రెనేడ్లు విసిరారు. అయితే అవి గురి తప్పి రోడ్డుపైనే పేలిపోయాయి. ఈ ఘటనలో ఆరుగురు సాధారణ పౌరులు గాయపడ్డారని, వాళ్లను హుటాహుటిన ఆస్పత్రికి తరలించామని పోలీసులు చెప్పారు. గ్రెనేడ్లు విసిరి పారిపోయిన ముష్కరుల కోసం గాలిస్తున్నామన్నారు.
కాగా,బారాముల్లా జిల్లా కేంద్రంలో సోమవారం ఉదయం గ్రెనేడ్ దాడి జరగడానికి కొద్ది గంటల ముందు.. జిల్లాలోని సోపూర్ ఏరియాలోనూ ఇదే తరహా దాడి జరిగింది. ఆదివారం రాత్రి 9.25 గంటల సమయంలో.. వార్ పోరా పోలీస్ పోస్టుపైకి ముష్కరులు హ్యాండ్ గ్రెనేడ్లు విసిరేసి పారిపోయారు. అదృష్టవవాత్తూ ఆదివారం నాటి ఘటనలో ప్రాణనష్టం జరగలేదని అధికారులు చెప్పారు. ఈ రెండు దాడులకు ఏదైనా సంబంధం ఉందా అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నామని జమ్మూకాశ్మీర్ పోలీసులు చెప్పారు.
Recommended Video
ఇక, శనివారం జమ్మూ సిటీలోనూ సాయుధ టెర్రరిస్టులు.. పంతా చౌక్ వద్ద తనిఖీలు చేస్తోన్న సీఆర్పీఎఫ్, జమ్మూకాశ్మీర్ పోలీసుల సంయుక్త బృందాలపై కాల్పులు జరిపి పారిపోయారు. అప్రమత్తమైన బలగాలు ఆ ప్రాంతాన్ని స్వాధీనంలోకి తీసుకుని కార్డెన్ సెర్చ్ నిర్వహించాయి. పారిపోయిన టెర్రరిస్టులు.. ఓ ఇంట్లో దాక్కొని మళ్లీ కాల్పులు జరిపారు. గంటపాటు జరిగిన ఎన్ కౌంటర్ లో జమ్మూకాశ్మీర్ పోలీస్ శాఖకు చెందిన ఏఎస్ఐ ప్రాణాలు కోల్పోగా, ముగ్గురు టెర్రరిస్టులు హతమయ్యారు. జమ్మూకాశ్మీర్లోని సరిహద్దు జిల్లా రాజౌరిలో నియంత్రణ రేఖ (ఎల్ఓసీ) వెంబడి నౌషేరా సెక్టార్ పైకి పాక్ బలగాలు ఆదివారం జరిపి కాల్పుల్లో ఇండియన్ ఆర్మీకి చెందిన జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్ (జేసీఓ) ఒకరు మృతి చెందారు.