ఎక్కడ్నుంచి వచ్చారో తెలియదు: రిసెప్షన్కు 100కిపైగా అతిథులు, వరుడు, అతడి తండ్రి అరెస్ట్
ఛండీగఢ్: దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తున్నా.. కొందరు మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ రోగులను మరింతగా పెంచుతున్నారు. తాజాగా, కరోనా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన ఓ వరుడిని శనివారం రాత్రి అరెస్ట్ చేశారు. ఈ ఘటన పంజాబ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. ఇక్కడ వీకెంట్ లాక్డౌన్ అమలులో ఉంది.
వరుడు, అతడి తండ్రి అరెస్ట్
పంజాబ్ రాష్ట్రంలోని జలంధర్లో రిసెప్షన్ పార్టీ(వివాహం తర్వాత జరిగే వేడుక) జరుగుతోంది. ఆ వేడుకకు కరోనా నిబంధనలకు విరుద్ధంగా 100 మందికిపైగా అతిథులు హాజరయ్యారు. కరోనా నిబంధనలను ఉల్లంఘించిన క్రమంలో వరుడు, అతడి తండ్రిని పోలీసులు అరెస్ట్ చేశారు.
పోలీసులను చూసి పరారైన అతిథులు
పోలీసుల రాకను గమనించిన అతిథులు అక్కడ్నుంచి పరారు కావడం గమనార్హం. ఘటనపై జలంధర్ డీప్యూటీ కమిషనర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో వీకెండ్ లాక్డౌన్ ఉందని, అంతేగాక, కర్ఫ్యూ సమయంలో ఈ వేడుకను నిర్వహించి కరోనా నిబంధనలను ఉల్లంఘించినందుకే వారిని అరెస్ట్ చేశామని తెలిపారు.
అనుమతి లేకుండానే రిసెప్షన్ పార్టీ..
అంతేగాక, రిసెప్షన్ పార్టీకి కూడా ఎలాంటి అనుమతులూ లేవని డీసీపీ చెప్పారు. ఇలాంటి కార్యక్రమాలకు 20 మందికంటే ఎక్కువ ఉండకూడదనే నిబంధన ఉందని, దాన్ని వీరు ఉల్లంఘించారని తెలిపారు. దీంతో వారిపై కేసు నమోదు చేసి వరుడు, అతడి తండ్రిని అరెస్ట్ చేసినట్లు డీసీపీ వెల్లడించారు. ఇండియన్ పీనల్ కోడ్ 188 కింద వారిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
రిసెప్షన్ పార్టీకి అంతమంది ఎక్కడ్నుంచి వచ్చారో తెలియదు..
కాగా, తన రిసెప్షన్ పార్టీకి అంతమంది ఎలా, ఎక్కడ్నుంచి వచ్చారో తనకు తెలియదని, వచ్చిన వారితో తనకు సంబంధం లేదని వరుడు పోలీసులకు చెప్పడం గమనార్హం.
కరోనా కేసులు భారీగా పెరుగుతుండటంతో పంజాబ్ ప్రభుత్వం గత వారం నుంచి కరోనా నిబంధనలను కఠినంగా అమలు చేస్తోంది. ఏప్రిల్ 30 వరకు నైట్ కర్ఫ్యూ విధించింది. బార్లు, సినిమా హాళ్లు, స్పాలు మూసివేశారు. వివాహాది ఎలాంటి కార్యక్రమాలకైనా 20 మందికి మించకూడదని స్పష్టం చేసింది. రాష్ట్రంలో కర్ఫ్యూను రాత్రి 8 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు అమలు చేస్తున్నారు.