ప్రత్యేక సమావేశాలు?: జిఎస్టి బిల్లుపై జవదేకర్
లక్నో: వర్షాకాల పార్లమెంటు సమావేశాలు సరిగ్గా జరగకపోవడంతో ఆమోదం పొందని వస్తు సేవల బిల్లు రానున్న రోజుల్లో తప్పక పాస్ అవుతుందని కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ ఆశాభావం వ్యక్తం చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు.
కీలక బిల్లులు ఆమోదం కావాల్సి ఉన్న నేపథ్యంలో ప్రత్యేక సమావేశాల ఏర్పాటు అంశాన్ని సైతం ఆయన సూచనప్రాయంగా ప్రస్తావించారు. ఈ విషయమై మీడియా అడిగిన ప్రశ్నకుగాను ఆయన స్పందించారు. పార్లమెంటు సమావేశాలు ఇంకా ప్రొరోగ్ కాలేదని, నిరవధిక వాయిదా మాత్రమే పడ్డాయని తెలిపారు.
కాగా, పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఒక్క రోజు కూడా సరిగ్గా పనిచేయకుండా ముగిసిపోయాయి. ప్రభుత్వ కార్యక్రమాలను అడ్డుకునే వ్యూహంతో కాంగ్రెస్, ఇతర విపక్షాలు రచించిన ప్రతిస్థంభన వ్యూహం విజయవంతమైంది.
సభా కార్యక్రమాలు పూర్తిగా తుడుచుపెట్టుకుపోయాయి. దాంతో కీలకమైన వస్తు, సేవల బిల్లు చట్టరూపం దాల్చకుండానే ఆగిపోయింది. కాగా, జీఎస్టీ బిల్లు పార్లమెంట్ ముందు చాలా ఏళ్లుగా పెండింగ్లో ఉంది. యూపీఏ హయాం నుంచే ఆ బిల్లుపై చర్చలు జరుగుతున్నా ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు.
ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆ బిల్లులో మళ్లీ కదలిక వచ్చింది. గత మే నెలలో జీఎస్టీ బిల్లును లోకసభ ఆమోదించింది. కానీ, అధికార పక్షం మైనారిటీలో ఉన్న రాజ్యసభలో ప్రతిపక్షాలు ఆ బిల్లును అడ్డుకున్నాయి.