ముఖ్యమంత్రి రేసులో మాజీ సీఎం భార్య - కొడుకు..!!
సిమ్లా: హిమాచల్ ప్రదేశ్లో భారతీయ జనత పార్టీ జోరు తగ్గింది. గుజరాత్ను క్లీన్ స్వీప్ చేసిన కమలనాథులు ఇక్కడ చతికిల పడ్డారు. అధికారాన్ని కోల్పోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఘన విజయాన్ని సాధించే దిశగా సాగుతోంది. ఇప్పటికే- ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన మేజిక్ ఫిగర్ను దాటింది. అది బొటాబొటిగానే అయినప్పటికీ- అధికారాన్ని అందుకుంటామనే ధీమా కాంగ్రెస్ నాయకుల్లో నెలకొంది.
హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఉన్న మొత్తం స్థానాల సంఖ్య.. 68. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన సంఖ్యాబలం 35 సీట్లు. ఈ మేజిక్ ఫిగర్ను అందుకోనుంది కాంగ్రెస్. ఆ పార్టీ అభ్యర్థులు 37 స్థానాల్లో ఆధిక్యతలో కొనసాగుతున్నారు. అధికారంలో ఉన్న బీజేపీ 29
నియోజకవర్గాల్లో లీడింగ్లో ఉన్నారు. ఇతరులు మూడు చోట్ల తమ సమీప ప్రత్యర్థులపై ఆధిక్యతను సాధించారు. తొలి గంటలో వెనుకపడిన హస్తం పార్టీ- ఆ తరువాత దూసుకొచ్చింది. బీజేపీని వెనక్కి నెట్టింది.

ఓట్ల లెక్కింపు కొనసాగుతున్న కొద్దీ ఆధిక్యత చేతులు మారే అవకాశం లేకపోలేదు. తక్కెడ కాంగ్రెస్ వైపే మొగ్గుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం దాదాపుగా ఖాయమైన ప్రస్తుత పరిస్థితుల్లో కొత్త ముఖ్యమంత్రి ఎవరనేది చర్చనీయాంశమౌతోంది. హిమాచల్ ప్రదేశ్కు కాంగ్రెస్ తరఫున ముఖ్యమంత్రి పగ్గాలను ఎవరు అందుకుంటారనే విషయం హాట్ డిబేట్గా మారింది.
ఈ పరిణామాల మధ్య ఒకట్రెండు పేర్లు తెర మీదికి వచ్చాయి. హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధినేత్రి ప్రతిభా సింగ్ పేరు చక్కర్లు కొడుతోంది. ముఖ్యమంత్రి రేసులో ఆమె ముందంజలో ఉన్నారు. ప్రతిభా సింగ్.. హిమాచల్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, దివంగత వీరభద్ర సింగ్ భార్య. మండీ లోక్సభ నియోజకవర్గానికి ఆమె ప్రాతినిథ్యాన్ని వహిస్తోన్నారు. ఇప్పుడు ఆమెను ముఖ్యమంత్రిగా నామినేట్ చేయవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమౌతోన్నాయి.

అదే సమయంలో వీరభద్రసింగ్- ప్రతిభాసింగ్ కుమారుడు విక్రమాదిత్య పేరు కూడా వినిపిస్తోంది. సిమ్లా రూరల్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన ఆయన భారీ ఆధిక్యతో కొనసాగుతున్నారు. సీఎం రేసులో విక్రమాదిత్య పేరు కూడా చక్కర్లు కొడుతోంది. యువకుడు కావడం వల్ల ఆయన వైపే కాంగ్రెస్ అధిష్ఠానం మొగ్గు చూపుతుందనే అభిప్రాయాలు వ్యక్తమౌతోన్నాయి.












Click it and Unblock the Notifications