పాఠం నేర్చుకున్నా: మోడీ, కాంగ్రెస్ నేత వాఘేలా ప్రశంస
గాంధీనగర్: కాబోయే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా రాజీనామా చేయనున్నారు. ఈ నేపథ్యంలో గుజరాత్ అసెంబ్లీ ప్రత్యేకంగా బుధవారం సమావేశమైంది. ఈ సందర్భంగా మోడీ మాట్లాడారు. ఎన్నికలు ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుండి దేశవ్యాప్తంగా అందరి చూపు గుజరాత్ వైపే ఉందన్నారు. ఇదొక చరిత్రాత్మకమైన విజయమన్నారు. తాను ముఖ్యమంత్రిగా పని చేసినన్ని రోజులు ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నామన్నారు.
విజయం పార్టీది, కార్యకర్తలది, నాయకులది, ప్రజలందరిదీ అన్నారు. తుఫాను, భూకంపాలను గుజరాత్ నిబ్బరంగా తట్టుకుందన్నారు. ప్రస్తుతం దేశ అభివృద్ధి చాలా ముఖ్యమన్నారు. గుజరాత్ అసెంబ్లీలో ఎన్ని పాఠాలు నేర్చుకున్నానని చెప్పారు. గుజరాత్ అభివృద్ధిలో ప్రతి గుజరాతీ పాత్ర ఉందన్నారు. నాలుగుసార్లు గుజరాత్ సిఎం అయ్యే అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు. దేశానికి ప్రధాని అయ్యే అవకాశమిచ్చిన ప్రజలకు కృతజ్ఞతలన్నారు.
సమస్యలను సవాళ్లను సమర్థవంత పాలనతో అధిగమిస్తానని చెప్పారు. గుజరాత్ అసెంబ్లీలో ఎన్నో పాఠాలు నేర్చుకున్నానని చెప్పారు. కొత్త ఆలోచనలను సమర్థవంతంగా అమలు చేయడంలోనే విజయం దాగి ఉందన్నారు. కాగా మోడీ మాట్లాడిన తర్వాత శాసన సభ్యులు బల్లలు చరుస్తూ తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. సమస్యలు ఎక్కడున్నా సమాధానం కూడా ఉంటుందన్నారు. కాగ్ను రాజకీయ ఆయుధంగా వాడవద్దన్నారు. పటిష్టమైన పరిపాలనా విధానాలు గుజరాత్ అభివృద్ధికి దోహదపడతాయన్నారు.
దేశాన్ని అభివృద్ధి పథంలో నడపడమే తన ముందున్న లక్ష్యమని చెప్పారు. ఎన్నో కుంభకోణాలతో దేశాభివృద్ధి క్షీణించిపోయిందన్నారు. దేశాభివృద్ధిలో పౌరులందర్నీ భాగస్వాములను చేస్తానని చెప్పారు. సమర్థవంతమైన పాలనను అందించడమే ప్రధానిగా తన ముందు ఉన్న లక్ష్యమన్నారు. దేశాభివృద్ధిని గాడిలో పెట్టడమే తన ముందున్న ప్రధాన లక్ష్యం, సవాల్ అన్నారు. తను ప్రతి ఎమ్మెల్యేను సమానంగా చూశానని చెప్పారు. కాగా అనంతరం మోడీ తన రాజీనామా లేఖను గవర్నర్కు ఇచ్చారు.
అమిత్ షా మాట్లాడుతూ...
అంతకుముందు అమిత్ షా మాట్లాడుతూ.. గుజరాత్ బిడ్డ ప్రధాని కావడం గర్వంగా ఉందన్నారు. దేశవ్యాప్తంగా ప్రజలు మోడీని ఆదరించారన్నారు. గుజరాత్లో వలె మోడీ దేశాన్ని మొత్తం అభివృద్ధి చేస్తారని ఆకాంక్షించారు. దేశవ్యాప్తంగా ప్రజలు మోడీని ఆశీర్వదించారన్నారు. దేశ సమస్యలు పరిష్కరించే సత్తా మోడీకే ఉందన్నారు. మహాత్మా గాంధీ, సర్దార్ వల్లభాయ్ పటేల్ల తర్వాత ఈ దేశాన్ని మరో గుజరాతీ నడిపే అవకాశం వచ్చినందుకు సంతోషంగా ఉందన్నారు.
మోడీపై కాంగ్రెస్ నేత శంకర్ సింగ్ వాఘేలా ప్రశంసల జల్లు
మోడీ పైన కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత శంకర్ సింగ్ వాఘేలా ప్రశంసల జల్లు కురిపించారు. 1982లో రెండు లోకసభ సీట్లను గెలుచుకున్న పార్టీని, మోడీ 282 సీట్లలో గెలిపించారని కితాబిచ్చారు.