ఆవుపేడ పూసుకుంటే కరోనాకు చెక్?: ప్రమాదకర ఫంగల్ ఇన్ఫెక్షన్ అంటూ వైద్యుల హెచ్చరిక
గాంధీనగర్: కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో పలువురు తమ సొంత వైద్యాన్ని నమ్ముకుంటున్నారు. ఎలాంటి అవగాహన, రుజువులు లేకుండానే సొంత వైద్యంతో ముందుకెళ్లడం సరికాదని వైద్యులు చెబుతున్నారు. గుజరాత్తోపాటు పలు ఉత్తరాది రాష్ట్రాల్లో ఆవుపేడ శరీరానికి రాసుకోవడం, పూసుకోవడంతో కరోనా రాదనే అపోహతో కొందరు ఆ పనిచేస్తున్నారు.
ఆవుపేడ పూసుకోవడం ప్రమాదకరమే..
అయితే, ఆవుపేడ శరీరానికి రాసుకోవడం, పూసుకోవడం ప్రమాదకరమని, అంతేగాక, దాని వల్ల మ్యూకోమైకోసిస్ వంటి ఫంగల్ ఇన్ఫెక్షన్లు తలెత్తే ప్రమాదం ఉందని గుజరాత్ వైద్యులు హెచ్చరిస్తున్నారు. కరోనాకు వ్యతిరేకంగా రోగనిరోధక శక్తి పెరుగుతుందన్న నమ్మకంతో.. శ్రీస్వామి నారాయణ్ గురుకుల్ విశ్వవిద్యాలయ ప్రతిష్టానంలో కొందరు ఆవుపేడ చికిత్స పొందుతున్నారు. ప్రతి ఆదివారం ఇక్కడికి కొందరు వచ్చి పేడ, మూత్రాన్ని ఒంటికి పూసుకుంటున్నారు. కొద్ది సేపు అయ్యాక ఆపు పాలతో శుభ్రం చేసుకుంటున్నారు. ఫ్రంట్లైన్ వర్కర్లు, మెడికల్ షాపుల్లో పనిచేసే వారు కూడా ఈ చికత్స తీసుకుంటుండటం గమనార్హం. అయితే, ఈ పేడ వైద్యంపై వైద్యులు ప్రజలకు హెచ్చరికలు చేస్తున్నారు.
విసర్జించిన వ్యర్థం కరోనాను ఎలా తగ్గిస్తుంది?
ఆవుపేడ, మూత్రంతో చికిత్స ఎంత వరకు పనిచేస్తుందో, దీని ద్వారా కరోనాకు వ్యతిరేకంగా రోగనిరోధక శక్తి పెరుగుతుందని ఏ శాస్త్రీయ పరిశోధనలో వెల్లడైందో ఎవరికీ తెలియదని వైద్యులు చెబుతున్నారు. పేడను శరీరానికి పూసుకోవడం ద్వారా ఇతరత్రా ఇన్ఫెక్షన్లుు సోకే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు. పేడ అనేది శరీరం విసర్జించిన వ్యర్థమని, ఇది మరో శరీరాన్ని బలోపేతం చేసి కరోనావైరస్ నుంచి రక్షణ ఇవ్వలేదని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ దిలీప్ మావ్లంకర్ స్పష్టం చేశారు. పేడ చికిత్సలో ఎలాంటి శాస్త్రీయత లేదన్నారు.
అశాస్త్రీయ పద్ధతుల జోలికి వెళ్లొద్దంటున్న వైద్యులు
ప్రజలు ఇలాంటి చికిత్స జోలికి వెళ్లకుండా ఉంటేనే మంచిదని సూచించారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో కరోనాకు చికిత్స చేయడం జరుగుతోందని, ఆస్పత్రుల్లో వైద్యులను సంప్రదించాలని సూచించారు. కాగా, ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఆందోళన చెందుతున్న ప్రజలు ఇలాంటి సొంత వైద్యాలను ఎంచుకుంటున్నట్లు తెలుస్తోంది. అయితే, కరోనా వ్యాక్సిన్లు కూడా అందుబాటులోకి వచ్చిన తర్వాత ఇలాంటి అశాస్త్రీయమైన పద్ధతులను ఎంచుకోవడం సరికాదని వైద్యులు హితవు పలుకుతున్నారు. మరోవైపు, గుజరాత్లోని భరూచ్ ప్రాంతంలో కరోనా మరణాలను ప్రభుత్వం తక్కువ చూపిస్తున్నారని మీడియా కథనాలు, ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.