ఇదీ అమిత్ షా వ్యూహం: జేడీయూ నేత ఛోటు వాసవకు నేమ్సేక్ ప్రాబ్లం
అహ్మదాబాద్: గుజరాత్ రాష్ట్రంలోని పేరొందిన గిరిజన నాయకుడు, ఎమ్మెల్యే ఛోటు వాసవ.. తిరిగి ఝాగాడియా స్థానం నుంచి మళ్లీ పోటీ చేయనున్నారు. కాకపోతే ఒకప్పటి ఆయన ప్రాతినిధ్యం వహించిన యునైటెడ్ జనతాదళ్ (జేడీయూ) మాత్రం అదే పేరు గల ఛోటు వాసవను అధికారిక అభ్యర్థిగా రంగంలోకి దించనున్నది. గత ఆగస్టు నెలలో రాజ్యసభ ఎన్నికల్లో నాటకీయ ఫక్కీలో కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి - సోనియాగాంధీ రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్ విజయం సాధించడంతో తొలిసారి జేడీయూ తిరుగుబాటు నేత ఛోటు వాసవ పేరు పతాక శీర్షికలకు ఎక్కింది.
Recommended Video
ఝాగాడియా స్థానం కావడంతో జేడీయూ కూడా ఏరికోరి ఛోటు వాసవ పేరు గల అభ్యర్థిని అధికారిక ఎన్నికల చిహ్నం బాణం గుర్తుపై బరిలోకి దించనున్నది. తాజా ఎమ్మెల్యే ఛోటు వాసవ మాత్రం తన కొడుకు మహేశ్ స్థాపించిన భారతీయ ట్రైబల్ పార్టీ (బీటీపీ) గుర్తు 'ఆటో రిక్షా' పై పోటీ చేయనున్నారు.
‘ఆటో రిక్షా' గుర్తుపై పోటీ చేస్తున్న వాసవ
గత ఆగస్టులో గుజరాత్ రాష్ట్ర పరిధిలో జరిగిన ద్వైవార్షిక రాజ్యసభ ఎన్నికల్లో జేడీయూ అధినేత నితీశ్ కుమార్ ఆదేశాలు బేఖాతర్ చేసి మరీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి.. సోనియా గాంధీ రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్కు ఓటేసి ఆయన్ను గట్టెక్కించిన నేపథ్యం సిట్టింగ్ ఎమ్మెల్యే ఛోటు వాసవది. తొలి దశలో డిసెంబర్ తొమ్మిదో తేదీన జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఝగాడియా స్థానానికి ఎన్నిక జరుగనున్నది. ఐదుసార్లు అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహించిన సిట్టింగ్ ఎమ్మెల్యే వాసవ.. రాష్ట్రంలోనే ప్రముఖ గిరిజన నేతల్లో ఒక్కరంటే అతిశయోక్తి కాదు. జేడీయూ అధికారిక గుర్తు ‘బాణం'పై నూతనంగా ఎన్నికల రణ రంగ ప్రవేశం చేస్తున్న అభ్యర్థి ఛోటు వాసవ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే ఛోటు వాసవకు ఒకింత ముప్పు పొంచి ఉన్నది.
బీజేపీ అభ్యర్థి పేరు గల వారు 11 మంది పోటీ చేసినా..
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ఛోటు వాసవ మాదిరిగానే పలువురు కీలక నేతల పేరుతో పలు అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థులు పోటీ చేయడం ఓటర్లలో గందరగోళం నెలకొంది. అందునా గ్రామీణ ప్రాంతాల్లో పూర్తిగా నిరక్షరాస్యులకు నిలయమైన ఝగాడియా వంటి పలు అసెంబ్లీ స్థానాల్లో ఎవరు ఏ పార్టీ తరఫున ఎమ్మెల్యేలుగా పోటీ చేస్తారన్న విషయం తెలియక ఆందోళనకు గురి అవుతున్నారు. ఆయా పార్టీల అభ్యర్థుల విజయావకాశాలు ప్రభావితం అయ్యాయి. అంతెందుకు 2014 లోక్సభ ఎన్నికల్లో మహా సముద్ స్థానంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అజిత్ జోగి.. బీజేపీ ప్రత్యర్థి చందూలాల్ సాహు చేతిలో అతి స్వల్ప తేడాతో ఓటమి పాలయ్యారు. ఈ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి పేరుతో 11 మంది పోటీ చేసినా మరీ ఆయన విజయం సాధించడం గమనార్హం.
ప్రజాస్వామ్య పరిరక్షణకే జేడీయూ నేత మద్దతు ఇలా
సిట్టింగ్ ఎమ్మెల్యే ఛోటు వాసవ సతీమణి మధు వాసవ ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘పార్టీ ఆదేశాల మేరకు నా భర్త ఛోటు వాసవ పోటీ చేశారే తప్ప.. తనకు తానుగా ఎన్నికల్లో పోటీ చేయాలని కాని, రాజకీయాల్లో చురుగ్గా వ్యవహరించాలని గానీ ఆయనకు లేదు' అని చెప్పారు. తన భర్త ఎన్నికల ప్రచారానికి వెళ్లారని, ఆయన తిరిగి ఎప్పుడు వస్తారో సమాచారం లేదని మధు వాసవ చెప్పారు. ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలుపుతున్నట్లు ఛోటు వాసవ చెప్పారు. ఇందుకోసం మహేశ్ వాసవ సారథ్యంలోని బీటీపీకి కాంగ్రెస్ పార్టీ.. డీడీయాపాడతోపాటు ఐదు అసెంబ్లీ స్థానాలను కేటాయించింది. ‘ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం రాజ్యసభ ఎన్నికల్లో నా తండ్రి ఛోటు వాసవ.. కాంగ్రెస్ పార్టీకి ఓటేశారు. జేడీయూ పార్టీ తన ఎన్నికల గుర్తు తీసేసుకున్నారు.
బీజేపీలో ప్రజాదరణ గల గిరిజన నేతలు కరువు
ఈ దఫా బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా.. ఝగాడియా స్థాన ఎమ్మెల్యే ఛోటు వాసవ అనే పేరు గల మరో అభ్యర్థిని ఎంపిక చేశారు. కానీ గత ఎన్నికల్లో నా తండ్రి ఛోటు వాసవ ప్రతి ఒక్క ఓటరుకు తెలుసు. ఆయన గత ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులను ఓడించారు. ఈ దఫా అమిత్ షా ప్లాన్ విజయం సాధించదు' అని మహేశ్ వాసవ చెప్పారు. మారిన రాజకీయ పరిస్థితుల్లో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో గిరిజన ప్రాంతంలో తమ పలుకుబడి పెంచుకోవడానికి ఇటు కాంగ్రెస్, అటు అధికార బీజేపీ ప్రయత్నాలు సాగిస్తున్నాయి. గుజరాత్ రాష్ట్రంలోని ఆదివాసీల రీజియన్ ఇటు మధ్యప్రదేశ్, అటు మహారాష్ట్ర పొరుగు వరకు విస్తరించి ఉంది. గుజరాత్ రాష్ట్రంలో గిరిజనుల జనాభా 15 శాతంగా ఉన్నది. గుజరాత్ రాష్ట్ర మాజీ పర్యావరణ శాఖ మంత్రి గన్పాత్ వాసవ మినహా ప్రజాదరణ పొందిన నేత బీజేపీలో లేరు. ఆయన ద్వారా మాత్రమే ఆదివాసీల మనస్సు చూరగొనేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తోంది.