డిప్యూటీ సీఎంకు బిగ్ షాక్..! ఎక్స్ అకౌంట్ లో పాకిస్తాన్, టర్కీ జెండాలు.. !
కశ్మీర్లో పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ టార్గెట్ గా భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టింది. పాకిస్తాన్ పై భారత క్షిపణులు దూసుకుపోతున్న వేళ ఆ దేశానికి టర్కీ అండగా నిలిచింది. తమ డ్రోన్లు పంపడం ద్వారా కశ్మీర్లో దాడులకు పురికొల్పింది. దీంతో పాకిస్తాన్ తో పాటు టర్కీకి వ్యతిరేకంగా కొంతకాలంగా దేశంలో నిరసనలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. ఇలాంటి సమయంలో హ్యాకర్లు ఓ కీలక రాజకీయ నేతను టార్గెట్ చేసి ఆయన ఎక్స్ ఖాతాను హ్యాక్ చేశారు. వారు అంతటితో ఆగలేదు.
మహారాష్ట్ర డిప్యూటీ సీఎం, శివసేన (షిండే) వర్గం నేత కూడా అయిన ఏక్ నాథ్ షిండే ఎక్స్ అకౌంట్ ను హ్యాకర్లు తాజాగా హ్యాక్ చేశారు. అందులో పాకిస్తాన్, టర్కీ జాతీయ జెండాలు పెట్టారు. దీంతో ఆయన అభిమానులు వాటిని చూసి షాకయ్యారు. ప్రస్తుతం మహారాష్ట్రలో బీజేపీ సంకీర్ణ ప్రభుత్వంలో షిండే పార్టీ శివసేన భాగస్వామిగా ఉంది. అలాంటి సమయంలో ఇలా షిండే అకౌంట్ హ్యాక్ కావడం, అందులో పాకిస్తాన్, టర్కీ జెండాలు ప్రత్యక్షం కావడంతో దీని వెనుక వ్యూహంపై చర్చ జరుగుతోంది.

దీంతో షిండే వెంటనే సైబర్ క్రైమ్ పోలీసుల్ని అలర్ట్ చేశారు. దీంతో పాటు ఆయన ఎక్స్ అకౌంట్ లోకి ప్రవేశించి పాకిస్తాన్, టర్కీ జెండాల్ని డిలీట్ చేశారు. ఆ తర్వాత ఎక్స్ అకౌంట్ ను సైతం తిరిగి హ్యాకర్ల నుంచి స్వాధీనం చేసుకుని దాన్ని పునరుద్ధరించారు. దీంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. ఈ మొత్తం వ్యవహారం ఓ 30 నుంచి 40 నిమిషాల పాటు సాగిందని డిప్యూటీ సీఎం ఏక్ నాథ్ షిండే కార్యాలయం వెల్లడించింది.

ఇవాళ ఆసియాకప్ లో భాగంగా భారత్, పాక్ జట్ల మధ్య సూపర్ 4 మ్యాచ్ జరగాల్సి ఉంది. ఇలాంటి సమయంలో ఉద్దేశపూర్వకంగానే బీజేపీ మిత్రపక్షాన్ని రెచ్చగొట్టేందుకు హ్యాకర్లు ఇలా చేసి ఉండొచ్చని పోలీసులు చెప్తున్నారు. అదే సమయంలో డిప్యూటీ సీఎం అధికారిక ఎక్స్ అకౌంట్ కే రక్షణ లేకపోవడం కూడా మహారాష్ట్రలో చర్చనీయాంశంగా మారింది.












Click it and Unblock the Notifications