లవ్ జిహాద్ కేసు: హదియా భర్త గురించి విస్మయం గొలిపే వాస్తవాలు!
న్యూఢిల్లీ: దేశమంతటా చర్చనీయాంశమైన కేరళ లవ్ జిహాది కేసులో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ(ఎన్ఐఏ) అధికారులు విస్మయం గొలిపే వాస్తవాలను బయట పెట్టారు. హదియా భర్త షాఫిన్కు ఇద్దరు ఐసిస్ ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయని వారు తేల్చారు.
హిందూ మతానికి చెందిన అఖిల అశోకన్ ఇస్లాం మతం స్వీకరించి, తన పేరును హదియాగా మార్చుకుని గతేడాది డిసెంబర్లో షాఫిన్ ను పెళ్లాడడం, దీనిపై ఆమె తల్లిదండ్రులు కేరళ హైకోర్టులో ఫిర్యాదు చేయడం తెలిసిందే.
అఖిల పెళ్లి వెనుక ఐసిస్ కుట్ర ఉందన్న వారి ఆరోపణలతో ఏకీభవించిన హైకోర్ట్ హదియా పెళ్లిని రద్దు చేయడమేకాక ఇందులోని నిజానిజాల నిగ్గుదీయమంటూ కేసు విచారణను ఎన్ఐఏకు అప్పగించింది.
దీంతో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ రంగంలోకి దిగింది. ఐసిస్కు చెందిన ఒమర్ అల్ హింది కేసులో గతేడాది అక్టోబర్లో అరెస్టయిన మన్సీద్, పి సఫ్వాన్లతో హదియా భర్త షాఫిన్ పెళ్లికి ముందు నుంచే టచ్లో ఉన్నాడని ఎన్ఐఏ దర్యాప్తులో వెల్లడైంది.
హై కోర్టు జడ్జిలు, పోలీసు ఉన్నతాధికారులు, రాజకీయ నేతలు సహా పలువురు ప్రముఖులను టార్గెట్ చేసేందుకు ఐసిస్తో కలిసి మన్సీద్, సఫ్వాన్ కుట్ర పన్నారని ఎన్ఐఏ చార్జిషీటులో పేర్కొంది.
పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ)కి రాజకీయ అనుబంధ సంస్థ ఎస్డీపీఐ కార్యకర్తలంతా 'తానాల్' అనే ఫేస్బుక్ గ్రూప్లో సభ్యులుగా ఉన్నారు. ప్రముఖ మెసేజింగ్ అప్లికేషన్తోపాటు ఈ గ్రూప్ ద్వారా వీరిద్దరితో షాఫిన్ టచ్లో ఉన్నాడని ఎన్ఐఏ అధికారులు తెలిపారు.
వేటూనిఖా.కామ్ ద్వారా హదియా, షాఫిన్లు కలిసేందుకు మునీర్ సహకరించాడని ఎన్ఐఏ అధికారులు నమ్ముతున్నారు. మరోవైపు కేరళ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ హదియా భర్త సుప్రీం కోర్టును ఆశ్రయించాడు.
సుప్రీంకోర్టులో ఈ కేసు విచారణకు రాగా ప్రస్తుతం తల్లిదండ్రుల కస్టడీలో ఉన్న హదియా చదువుకోవడానికి సుప్రీం అనుమతించింది. ఒకవైపు ఎన్ఐఏ విచారణలో విస్మయం గొలిపే వాస్తవాలు వెల్లడి కాగా.. హదియా మాత్రం తన భర్త తనను ఎంతగానో ప్రేమిస్తున్నాడని, అతడితోనే కలిసి ఉండాలని తాను కోరుకుంటున్నానని చెబుతోంది.