మా దెబ్బకు సిద్ధంగా ఉండండి, మెరుపు దాడి రుచి చూపిస్తాం: సయీద్ హెచ్చరిక
న్యూఢిల్లీ: భారత్ సర్జికల్ స్ట్రయిక్ పైన జమాత్ ఉధ్ దవా చీఫ్ హఫీజ్ సయీద్ స్పందించాడు. అతను పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని మద్దతుదారులను ఉద్దేశించి మాట్లాడాడు. భారత మీడియా తప్పుడు కథనాలు ప్రసారం చేస్తోందని ఆరోపించాడు. మెరుపు దాడులు ఎలా ఉండాయో భారత్కు రూచి చూపిస్తామన్నాడు.
అసలు నిజమైన మెరుపు దాడులు అంటే అంటే ఏమిటనేది ప్రతి భారతీయుడికి రుచి చూపిస్తామని హెచ్చరించాడు. త్వరలోనే తమ దళాలు భారత దేశానికి తగిన గుణపాఠం చెబుతాయన్నాడు. అందుకు సిద్ధంగా ఉండాలని హెచ్చరించాడు. దాడులు రుచి చూపిస్తామని మన మీడియాకు కూడా సవాల్ విసిరాడు. అదే సమయంలో పాకిస్తాన్ దళాలను పొగడ్తలలో ముంచెత్తాడు.
కాగా, భారత్ - పాకిస్తాన్ల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో వాటిని నివారించేందుకు రెండు దేశాలతోనూ వివిధ మార్గాల్లో సంప్రదిస్తున్నట్లు చైనా ఇది వరకే తెలిపింది. ప్రాంతీయంగా శాంతి భద్రతలు నెలకొనేందుకు ఉభయ పక్షాలూ కలిసి పనిచేయాలని ఆశిస్తున్నట్లు చైనా విదేశీ మంత్రిత్వ శాఖ ప్రతినిధి జెంగ్ షౌంగ్ పేర్కొన్నారు.
రెండు దేశాలూ సమాచారాన్ని వృద్ధి చేసుకోవాలన్నారు. భారత్, పాక్లకు చైనా స్నేహశీల పొరుగు దేశమని, ద్వైపాక్షిక సంబంధాలు, వివిధ రంగాల్లో సహకారం మెరుగు పరుచుకోవడానికి రెండు దేశాలూ చర్చలు-సంప్రదింపుల ద్వారా తగురీతిలో వ్యవహరించాలని ఆశిస్తున్నట్లు తెలిపారు.