హరికృష్ణ కలకలం: రాజ్యసభకు డిగ్గీ, కెవిపి, టిఎస్సార్
న్యూఢిల్లీ/హైదరాబాద్: రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలకు కత్తి మీద సాము అయింది. మంగళవారంతో రాజ్యసభ ఎన్నికలకు నామినేషన్ గడువు ముగియనుంది. దీంతో అభ్యర్థుల ఎంపికపై ఆ పార్టీలు మల్లగుల్లాలు పడుతున్నాయి. తెలుగుదేశం పార్టీలో రాజ్యసభ ఎంపిక కొత్త మలుపు తిరిగింది కూడా.
రేసులో ఉన్నా: హరికృష్ణ
తాను రాజ్యసభ రేసులో ఉన్నానని తెలుగుదేశం పార్టీ నేత, మాజీ రాజ్యసభ సభ్యులు నందమూరి హరికృష్ణ చెప్పారు. పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు నివాసంలో సోమవారం సాయంత్రం టిడిపి పోలిట్ బ్యూరో సమావేశమయింది. ఈ భేటీలో హరికృష్ణ రాజ్యసభ టిక్కెట్ కోసం పట్టుబట్టి కలకలం రేపారు. ఆయన ముప్పవు గంట పాటు భేటీలో కూర్చున్నారు.
సమావేశం జరుగుతుండగా కాసేపటికి హరికృష్ణ బయటకు వచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తాను కూడా రాజ్యసభ రేసులో ఉన్నానని చెప్పారు. రాజ్యసభ టిక్కెట్ను ఆశిస్తున్నానని తెలిపారు. తాను సమావేశంలో ఉండటం సరికాదనే ఉద్దేశ్యంతోనే బయటకు వచ్చానని తెలిపారు. తాను సమైక్యాంధ్ర కోసమే రాజ్యసభ పదవికి రాజీనామా చేశానని తెలిపారు.
తెలుగుదేశం పార్టీ నుండి మోత్కుపల్లి నర్సింహులు, గరికపాటి రామ్మోహన రావు, కంభంపాటి రామ్మోహన రావు, సీతామహాలక్ష్మి, ప్రతిభా భారతిలు కూడా రేసులో ఉన్నారు. వీరిలో ఇద్దరికి అవకాశం వస్తుందని ఇప్పటి వరకు భావించినప్పటికి హరికృష్ణ రావడంతో కొత్త మలుపు తిరిగింది. హరికృష్ణ పట్టుబడితే కచ్చితంగా ఇవ్వాల్సి ఉంటుంది. దీంతో మరొకరికి మాత్రమే అవకాశం ఉంది.
ఆ ముగ్గురికి ఛాన్స్
ఆంధ్రప్రదేశ్ నుండి కాంగ్రెసు పార్టీ అధిష్టానం ముగ్గురు అభ్యర్థులను ప్రకటించింది. కెవిపి రామచంద్ర రావు, టి సుబ్బిరామి రెడ్డి, ఎంఏ ఖాన్లకు అవకాశం ఇచ్చింది. ఉదయం నంది ఎల్లయ్య, కొప్పుల రాజుల పేర్లు తెర పైకి వచ్చినా వారికి అవకాశం దక్కలేదు. కాంగ్రెసు ముగ్గురు సిట్టింగులకు ఛాన్స్ ఇచ్చింది.
మధ్యప్రదేశ్ నుండి డిగ్గీ
కాంగ్రెసు పార్టీ అధిష్టానం ఆంధ్రప్రదేశ్ కాంగ్రెసు పార్టీ వ్యవహారాల పర్యవేక్షకులు దిగ్విజయ్ సింగ్కు రాజ్యసభ టిక్కెట్ను ఖరారు చేసింది. ఆయన మధ్య ప్రదేశ్ నుండి రాజ్యసభకు పోటీ చేయనున్నారు. గుజరాత్ నుండి మధుసూదన్ మిస్రీ పోటీ చేయనున్నారు.