హర్యానా హస్తగతమే-తేల్చేసిన మ్యాట్రిజ్ ఎగ్జిట్ పోల్-ఎన్ని సీట్లంటే..!
హర్యానాలో ఇవాళ జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీ గెలవబోతోందన్న అంశంపై ప్రముఖ సర్వే సంస్థ మ్యాట్రిజ్ తమ అంచనాల్ని విడుదల చేసింది. ఇందులో కాంగ్రెస్ పార్టీ హర్యానాలో ఘన విజయం సాధించబోతున్నట్లు తేల్చేసింది. బీజేపీతో ముఖాముఖీ తలపడిన కాంగ్రెస్ పార్టీ ఈ పోరులో విజేతగా నిలబోతున్నట్లు మ్యాట్రిజ్ సర్వే తేల్చింది. అధికార బీజేపీ రెండో స్ధానంలో నిలవబోతున్నట్లు ఈ ఎగ్జిట్ పోల్ ప్రకటించింది.
మ్యాట్రిజ్ ఎగ్జిట్ పోల్ ప్రకారం 90 సీట్లున్న హర్యానా అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ ఏకంగా 55 నుంచి 62 సీట్లు సాధించి ఏకపక్ష విజయాన్ని సొంత చేసుకోబోతోంది. అలాగే బీజేపీ కేవలం 18-24 సీట్లకు పరిమితం కాబోతున్నట్లు ఎగ్జిట్ పోల్ తేల్చింది. అటు జేజేపీ కూటమి కేవలం 0-3 సీట్లు, ఐఎన్ఎల్డీ కూటమి కూడా 3-6 సీట్లు మాత్రమే గెల్చుకునే అవకాశం ఉన్నట్లు మ్యాట్రిజ్ తేల్చేసింది. దీంతో హర్యానా తీర్పు ఎలా ఉండబోతోందో తేలిపోయింది.

హర్యానా అసెంబ్లీలో మొత్తం 90 సీట్లు ఉండగా.. వీటిలో విజయం కోసం దాదాపు వెయ్యి మంది అభ్యర్ధులు రంగంలో నిలిచారు. ఈ ఎన్నికల్లో దాదాపు రెండు కోట్ల మంది ఓటర్లు ఈసారి ఓటేశారు. ఇందులో కాంగ్రెస్, బీజేపీ, జేజేపీ-ఏఎస్పీ, ఐఎన్ఎల్డీ-బీఎస్పీ, ఆప్ ప్రధానంగా పోటీలో ఉన్నాయి. సాయంత్రం ఐదు గంటల కల్లా దాదాపు 61 శాతం ఓట్లు పోలయ్యాయి.
ఈ నెల 8న హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు ప్రకటించనున్నారు.












Click it and Unblock the Notifications