ఆటగాళ్లకు ఖాళీ కవర్లు ఇచ్చిన హర్యానా సిఎం హుడా
ఛండీఘర్: హర్యానా ముఖ్యమంత్రి భూపిందర్ సింగ్ హుడా చేతుల నుంచి నగదు(చెక్కుల రూపంలో) బహుమతి అందుకున్న ఓ ఇద్దరు ఆటగాళ్లు తమకిచ్చిన కవర్ తెరిచి చూసి ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. ఆ ఇద్దరు ఆటగాళ్లు ఎవరంటే.. భారత పారా క్రీడాకారుడు ప్రశాంత్ కర్మాకర్, జయదీప్ సింగ్. ఇటీవల జరిగిన కామన్వెల్త్ గేమ్స్, పారా గేమ్స్లలో హర్యానా నుంచి పతకాలు సాధించిన క్రీడాకారులందరికీ ముఖ్యమంత్రి భూపిందర్ సింగ్ హుడా అభినందనలు తెలిపారు. అందర్నీ పిలిపించి వారికి నగదు ప్రోత్సహకాలు అందజేశారు.
కామన్వెల్త్ గేమ్స్లో పతకాలు సాధించనప్పటికీ ప్రశాంత్ కర్మాకర్, జయదీప్ సింగ్కు ఒక్కొక్కరికి హర్యానా ప్రభుత్వం రూ. 5 లక్షలు ప్రకటించింది. శుక్రవారం నిర్వహించిన క్రీడాకారుల అభినందన కార్యక్రమంలో వీరిద్దరికీ సిఎం భూపిందర్ సింగ్ హుడా చెరో ఎన్వలప్ కవర్ అందించారు. అయితే ఆ కవర్లు తెరిచి చూసిన కర్మాకర్, జయదీప్ లు ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. ఎందుకంటే ఆ కవర్లు ఖాళీగా ఉన్నాయి. ఎలాంటి చెక్కులు లేవు.
ఈ విషయంలో ముఖ్యమంత్రికి తెలియడంతో ఇది సిబ్బంది చేసిన తప్పిదమేనని సమాధానమిచ్చారు. సోనాపేటలోని రాజీవ్ గాంధీ ఎడ్యుకేషన్ సిటీలో జరిగిన ఈ కార్యక్రమంలో దేశానికి ప్రాతినిథ్యం వహించి పతకాలు సాధించిన పలువురు క్రీడాకారులకు 13.72 కోట్ల రూపాయల ప్రోత్సాహకాలు సిఎం భూపిందర్ హుడా అందజేశారు.
కాగా, తమకు ఖాళీ కవర్లు అందజేయడంపై స్విమ్మర్ కర్మాకర్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తమను ఈ విధంగా చేయడం సరికాదని అన్నారు. దీనిపై స్పందించిన హర్యానా పారాలింపిక్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ గిరిరాజ్ సింగ్ మాట్లాడుతూ.. ప్రభుత్వం నుంచి వీరికి ప్రోత్సాహకాలు అందేలా చూస్తామని చెప్పారు. చివరి నిమిషంలో వీరి పేరును ప్రోత్సాహకాలు అందించాల్సిన వారి జాబితాలో చేర్చడంతో ఈ పొరపాటు జరిగిందని చెప్పారు.