ఏమైంది?: బీమా కోసం తనను తానే హత్య చేయించుకున్నాడు!
చంఢీఘర్: తన కుటుంబానికి ఎలాగైనా సాయం చేయాలనుకున్నాడు ఆ వ్యక్తి. ఏదారి లేకపోవడంతో తనను తానే హత్య చేయించుకోవాలని నిర్ణయానికి వచ్చాడు. ఎందుకంటే తన పేరును ఉన్న బీమా మొత్తం తన కుటుంబానికి చెందుతుందని భావించాడు. ఈ క్రమంలోనే తన నిర్ణయాన్ని అమలు చేసుకున్నాడు. హర్యానా రాష్ట్రంలోని సోనిపత్లో చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది.
వివరాల్లోకి వెళితే... సోనిపత్ ప్రాంతంలోని గోరద్ గ్రామానికి చెందిన సత్బీర్ సింగ్ వడ్డీ కింద రెట్టింపు డబ్బు ఇస్తానని చెప్పి రుణాలు తీసుకొని కిరణాదుకాణం నిర్వహిస్తున్నాడు. కాగా, జనం నుంచి తీసుకున్న రుణాలు తీర్చలేక సత్బీర్ సింగ్ రూ.60 లక్షల మేర బాకీ పడి అప్పుల ఊబిలో కూరుకుపోయాడు.
సత్బీర్కు భార్య, నలుగురు పిల్లలున్నారు. అప్పులతోపాటు సత్బీర్కు పలు రకాల ఆరోగ్య సమస్యలున్నాయి. ఈ క్రమంలో తాను ఆత్మహత్య చేసుకుంటే జీవిత బీమా డబ్బులు రావని, తాను హత్యకు గురైతే కుటుంబానికి సాయంగా బీమా డబ్బు ఉంటుందని సత్బీర్ భావించాడు.
తనను హతమార్చమని చెప్పి సత్బీర్ తన వద్ద పనిచేసే చాంద్తో ఒప్పందం కుదుర్చుకున్నాడు. సత్బీర్.. చాంద్కు రూ.2,500ల నగదు, నాటు తుపాకీని కొనిచ్చి తనను కాల్చి చంపమని కోరాడు. హత్య చేయించుకునే ముందు సత్బీర్ మద్యం తాగి, గంజాయి పొగ పీలుస్తూ మత్తులో జోగుతుండగా.. చాంద్ ఒప్పందం ప్రకారం తుపాకీ కాల్చి చంపాడు.
ఆ తర్వాత సత్బీర్ మృతదేహాన్ని దేవాలయం సమీపంలోని డ్రైనేజీలో పడేశాడు. పోలీసులు అనుమానంతో చాంద్ను పట్టుకొని ప్రశ్నిస్తే కేసును తప్పుదారి పట్టించేందుకు ప్రయత్నించాడు. అనంతరం సత్బీర్ హత్యకు గురైన రోజు చాంద్తో మాట్లాడిన కాల్ డిటైల్స్ వివరాలు చూపించడంతో అసలు విషయం చెప్పాడు. దీంతో పోలీసులు చాంద్ను అరెస్టు చేసి, అతని వద్ద ఉన్న తుపాకీని స్వాధీనం చేసుకున్నారు.
సత్బీర్ తానే స్వయంగా హత్య చేయించుకున్నాడని తేలడంతో ఆయన కుటుంబానికి బీమా సొమ్ము రాదని పోలీసులు తేల్చి చెప్పారు. దీంతో సత్పీర్ సింగ్ ప్రాణ త్యాగం వృథాగా మిగిలిపోవడంతోపాటు ఆ కుటుంబానికి తీరని శోకం మిగిల్చింది.