హాత్రస్ కేసులో షాకింగ్ ట్విస్ట్ - అమ్మాయిని చంపింది తల్లీ, అన్నలే - వేలిముద్రలతో నిందితుల లేఖ
సంచలనాత్మక హాత్రస్ గ్యాంగ్ రేప్ కేసులో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఘటన జరిగి నెల రోజులు కావొస్తున్నా, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలంటూ నేటికీ దేశవ్యాప్తంగా ఆందోళనలను కొనసాగుతున్నా.. క్షేత్రస్థాయిలో పోలీసుల దర్యాప్తు మాత్రం భిన్నంగా సాగుతోంది. యువతి ఆస్పత్రిలో చేరిన 11 రోజులకు శాంపిల్స్ సేకరించిన పోలీసులు.. మృతదేహాన్ని కాల్చేసిన తర్వాతగానీ ఆమెపై అత్యాచారం జరగలేదని చెప్పడం, ఆమెది అవారా(విశృంఖల) ప్రవర్తనని బీజేపీ నేతలు పేర్కొంటుండటంతో నిందితులకు మరింత బలం చేకూరినట్లయింది. అదే ఊపులో..
దేశంలో దళితులపై దాడులు శోచనీయం - శాంతిభద్రతలో తెలంగాణ నెం.1: సీఎం కేసీఆర్
వేలి ముద్రలతో ఎస్పీకి లేఖ
హాత్రస్ గ్యాంగ్ రేప్ కేసులో ప్రధాన నిందితుడైన సందీప్ సింగ్ ఠాకూర్, సహ నిందితులైన రాము, లవ్ కుష్, రవిలు ప్రస్తుతం రిమాండ్ ఖైదీలుగా అలీగఢ్ జైలులో ఉన్నారు. ప్రభుత్వ, పోలీసుల తీరు అనుకూలంగా ఉండటంతో తమ వంతు ప్రయత్నంగా ఆ నలుగురూ గురువారం జైలు సూపరింటెండెంట్ కు లేఖ రాశారు. గ్యాంగ్ రేప్, హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న తాము నిర్దోషులమని, కొందరు కావాలనే తమను తప్పుడు కేసులో ఇరికించారని నిందితులు లేఖలో పేర్కొన్నారు. లేఖపై వేలిముద్రలతో సంతకాలు చేసిన నలుగురు నిందితులు.. దాన్ని సిట్ బృందానికి చేర్చాల్సిందిగా జైలు అధికారిని కోరారు. అంతేకాదు..
చంపింది ఆ ఇద్దరే..
అధికారులకు హాత్రస్ నిందితులు రాసిన లేఖలో సంచలన అంశాలను పేర్కొన్నారు. చనిపోయిన యువతితో తనకు గాఢమైన స్నేహం ఉందని, ఆమెతో తరచూ మాట్లాడేవాడినని ప్రధాన ముద్దాయి సందీప్ సింగ్ చెప్పుకొచ్చాడు. తమ మధ్య స్నేహం అమ్మాయి కుటుంబీకులకు నచ్చేది కాదని, అందుకే తల్లీ, అన్న కలిసి ఆ అమ్మాయిని కొట్టి చంపిఉండొచ్చని, బాధిత యువతి మరణానికి బాధితురాలి తల్లి, సోదరుడు కారణమని, తమను వారు తప్పుడు కేసులో ఇరికించారని సందీప్ ఆరోపించాడు. మృతురాలి సోదరుడైన సందీప్, నిందితుల్లో ఒకడైన సందీప్ ఠాకూర్కు ముందు నుంచే పరిచయం ఉందని, వాళ్లు తరచూ ఫోన్లో మాట్లాడుకునేవారని, గతేడాది అక్టోబర్ నుంచి ఈ ఏడాది మార్చి వరకు 104 సార్లు కాల్స్ వెళ్లాయని పోలీసులు పేర్కొన్నారు. అయితే ఈ ఆరోపణలను బాధిత కుటుంబం ఖండించింది. ఇక ప్రస్తుత లేఖ విషయానికొస్తే..
ఆ రోజు చేనులో తనను కలిశాను..
హాత్రస్ యువతి హత్యాచారానికి గురైన సెప్టెంబర్ 14న చేనులో ఆమెను కలిసినట్లు ప్రధాన ముద్దాయి సందీప్ అంగీకరించాడు. కానీ హత్యతో మాత్రం సంబంధంల లేదన్నాడు. చాలా కాలంగా అమ్మాయితో తనకు స్నేహం ఉందని, తరచూ ఫోన్లో మాట్లాడుకునేవాళ్లమని, ఈ సంగతి తెలిసి ఆమె కుటుంబీకులు ఆమెను తీవ్రంగా కొట్టారని, చనిపోవడానికి ముందు కలిసినప్పుడు కూడా ఆమె గాయపడి ఉండటం చూశానని సందీప్ లేఖలో పేర్కొన్నాడు. రెండ్రోజుల కిందట హాత్రస్ కే చెందిన ఓ వ్యక్తి మీడియాతో మాట్లాడుతూ.. మృతురాలికి, ప్రధాన నిందితుడు సందీప్కు మధ్య పరిచయం ఉన్నదని, రెండు కుటుంబాల మధ్య గొడవ జరిగితే తాము నాలుగు నెలల కిందట పంచాయితీ నిర్వహించామని చెప్పాడు.
మారిన కథనం..
హాత్రస్ కేసుకు సంబంధించి తొలి నుంచీ వివాదాస్పదంగా వ్యవహరిస్తున్న పోలీసులు, అధికారులు.. బాధిత యువతి మృతదేహాన్ని బలవంతంగా కాల్చేసిన తర్వాత కథనాన్ని పూర్తిగా మార్చినట్లు కనిపిస్తోంది. శవం బూడిదైన తర్వాతే ఆమెపై రేప్ జరగలేదని, నిందితుడితో ఆమెకు స్నేహం ఉందని రోజుకో కొత్త విషయాన్ని లీక్ చేస్తున్నారు. గ్యాంగ్ రేప్, దాడి జరిగిన తర్వాత సరైన వైద్యం అందకపోవడంతో 15 రోజుల తర్వాత(సెప్టెంబర్ 29న) యువతి మరణించింది. అదే రోజు రాత్రి పోలీసులు ఆమె మృతదేహాన్ని రహస్యంగా తగులబెట్టేశారు. దీంతో కీలక ఆధారాలు పూర్తిగా బూడిదైపోయాయి.
Recommended Video
నరేంద్ర మోదీ అరుదైన రికార్డు - పాలకుడిగా 20 ఏళ్ల ప్రస్థానం - తొలిసారి హైడ్రామా - ఆపై జనామోదంతో