15ఏళ్ల బాలికపై గ్యాంగ్రేప్: గుజరాత్లోనూ హథ్రాస్ ఘటన అంటూ జిగ్నేష్ ఫైర్
జామ్నగర్: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని హాథ్రస్ ఘటనను మరువకముందే గుజరాత్ రాష్ట్రంలో అలాంటి దారుణమే చోటు చేసుకుంది. జామ్ నగర్లో ఓ 15 ఏళ్ల బాలికపై నలుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
కాగా, నలుగురు నిందితులు కూడా డ్రగ్ బానిసలని తెలిసింది. జామ్ నగర్లోని మహాదేవ్ నగర్లో సెప్టెంబర్ 28న ఈ దారుణం చోటు చేసుకుంది. 15ఏళ్ల బాధిత బాలికకు నిద్రమాత్రలు ఇచ్చి ఆమెపై నలుగురు నిందితులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని రూరల్ డీఎస్పీ ఏపీ జడేజా తెలిపారు.
నిందితులు దర్శన్ భాటియా, మిలాన్ భాటియా, దేవకరణ్ గాడ్విలను పోలీసులు అరెస్ట్ చేశారు. నాలుగో నిందితుడి కోసం పోలీసులు గాలింపు జరుపుతున్నారు. నిందితులందరూ కూడా మహదేవ్నగర్కు చెందినవారేనని తెలిపారు. నిందితులలో ఒకరు బాధితురాలికి తెలుసని చెప్పారు.
ఐపీసీ సెక్షన్ 376డీ, పోస్కో యాక్ట్ సెక్షన్లతో నిందితులపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. కాగా, వాద్గాం ఎమ్మెల్యే జిగ్నేష్ మేవానీ ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం ట్విట్టర్ వేదికగా స్పందించారు. గుజరాత్లో కూడా మరో హత్రాస్ ఘటన అంటూ పేర్కొన్నారు. రాష్ట్రంలో మహిళలపై నేరాలు పెరిగిపోతున్నాయని ఆరోపించారు. దేశ సామాజిక సాంస్కృతిక మార్పు జరగాలన్నారు.
ఇది ఇలావుండగా, సంత్రాపూర్లో ఓ 35 ఏళ్ల మహిళపై ఇద్దరు దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. నిందితులపై కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.