సిమ్ కార్డుకు ఆధార్ లింక్ చేశారా? మీ ఇంట్లోంచే చేయొచ్చు.. ఇదీ పద్ధతి, చేసేస్తే పోలా?
దేశంలోని ప్రతి మొబైల్ నంబర్ను ఆధార్ కార్డుతో అనుసంధానం చేయాలని కేంద్ర ప్రభుత్వం టెలికం సంస్థలను ఆదేశించిన విషయం తెలిసిందే.
న్యూఢిల్లీ: మీ మొబైల్ సిమ్ కార్డుకు మీ ఆధార్ నంబర్ ను అనుసంధానం చేశారా? ఇంకా లేదా? 'దీనికోసం మళ్లీ సంబంధిత స్టోర్ కి వెళ్లాలి.. అంత టైం లేదు బాసూ..' అంటారా? ఇప్పుడు అంత సీన్ లేదు.. మీ ఇంట్లోంచే ఈ పని చేసుకోవచ్చు.
Recommended Video
దేశంలోని ప్రతి మొబైల్ నంబర్ను ఆధార్ కార్డుతో అనుసంధానం చేయాలని కేంద్ర ప్రభుత్వం టెలికం సంస్థలను ఆదేశించిన విషయం తెలిసిందే. దీంతో ప్రతి టెలికం సంస్థ తమ కస్టమర్లను ఆధార్ లింక్ చేసుకోవాలంటూ సందేశాలు ఇస్తోంది.
ఆధార్ అనుసంధానం తప్పనిసరేం కాదని సుప్రీం కోర్టు గతంలో తీర్పు ఇచ్చినా, ఆయా టెలికం కంపెనీలు మాత్రం వినియోగదారుల మొబైల్ ఫోన్లకు సంక్షిప్త సందేశాలు పంపుతూనే ఉన్నాయి. ఇందుకు గడువును కూడా పేర్కొంటున్నాయి.
ఇప్పటి వరకు ఇలా...
ఇన్నాళ్లూ ఆయా టెలికాం సంస్థలు నిర్వహించే స్టోర్లు, రిటైల్ ఔట్లెట్లలో మొబైల్ నెంబర్తో ఆధార్ను అనుసంధానం చేసుకోవచ్చు. మొబైల్ వినియోగదారులు సంబంధిత టెలికాం సంస్థకు చెందిన స్టోర్కు వెళ్లి తమ మొబైల్ నెంబర్ను తెలియజేయగానే ఆ నెంబర్కు ఒక ఒటిపి పంపించే వారు. ఆ ఓటీపీతోపాటు ఆధార్ నెంబర్, బయోమెట్రిక్ మిషన్పై వేలిముద్ర వేయడం ద్వారా తమ పాత మొబైల్ నెంబర్తో ఆధార్ను అనుసంధానం చేసే ప్రక్రియ ముగుస్తుంది.
ఇప్పుడేమో ఇలా...
ఒకప్పుడు ఫొటో, ఏదో ఒక గుర్తింపు కార్డు నకలు ప్రతి ఇస్తే చాలు.. సిమ్ కార్డు చేతిలో పెట్టేవారు. కానీ ప్రస్తుతం సిమ్ జారీ ప్రక్రియలో చాలామార్పులు చోటుచేసుకున్నాయి. ఆధార్ ఆధారిత ఇ-కెవైసి ప్రక్రియ ద్వారానే చాలావరకు టెలికాం కంపెనీలు కొత్త సిమ్కార్డులను జారీ చేస్తున్నాయి. కొత్త ప్రీపెయిడ్ మొబైల్ కనెక్షన్ తీసుకునే సమయంలో దీనికోసం తప్పనిసరిగా ఆయా స్టోర్లకు వెళ్లాల్సిందే. అదే పోస్ట్ పెయిడ్ కనెక్షన్ అయితే ఆయా సంస్థలు కొన్ని ఏజెన్సీలను ఏర్పాటు చేసుకుని వినియోగదారుల ఇళ్ల వద్దనే బయోమెట్రిక్ సహా అవసరమైన ప్రక్రియను ముగించేస్తున్నాయి.
ఇకమీదట మీ ఇంట్లోంచే...
తాజాగా భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ) 2017 డిసెంబర్ 1 నుండి బయోమెట్రిక్ అవసరం లేకుండా, సంబంధిత అవుట్ లెట్కు వెళ్లకుండానే యూజర్లు ఇంటి నుంచే సులువుగా సిమ్ కార్డు వెరిఫికేషన్ చేసుకునే సదుపాయం కల్పించనున్నట్లు ప్రకటించింది. సిమ్ రీవెరిఫికేషన్ కోసం ప్రిపెయిడ్, పోస్ట్ పెయిడ్ కస్టమర్లకు టెలికం డిపార్ట్మెంట్ మూడు నూతన పద్ధతులను ప్రవేశపెట్టింది. అవి.. ఆధార్ ఓటీపీ బేస్డ్, యాప్ బేస్డ్, ఐవిఆర్ఎస్ సదుపాయం. ఇవి త్వరలో అందుబాటులోకి రానున్నాయి.
అనుసంధానం ఇలా...
ఇంట్లోంచే అనుసంధానం ఎలా చేసుకోవాలంటే... మొదట మీ మొబైల్ నెంబర్ నుండి సంబంధిత టెలికం ఆపరేటర్కు మీ ఆధార్ నెంబర్ను మెసేజ్ చేయాలి. మీ మెసేజ్ అందుకున్న టెలికం ఆపరేటర్లు మీ ఆధార్ నెంబర్ను ధ్రువీకరిస్తారు. ఆ తరువాత, భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ(యూఐడీఏఐ) కు ఓటీపీ రిక్వెస్ట్ను పంపిస్తారు. దీంతో యూఐడీఏఐ నుంచి వినియోగదారుని మొబైల్ నెంబర్కు ఓటీపీ వస్తుంది. దీంతో ఆధార్ వెరిఫికేషన్ ఇ-కెవైసి పూర్తి అవుతుంది. భలే సులభంగా ఉంది కదూ! అప్పుడే మొబైల్ చేతిలోకి తీసుకున్నారా? ఆ.. ఆగండాగండి.. ఇది డిసెంబర్ 1, 2017 నుంచి.. గుర్తుంచుకోండి!