చెత్తను తీసుకోమంటూనే.. నవజోత్ సింగ్ సిద్ధూపై అరవింద్ కేజ్రీవాల్ ప్రశంసలు
ఛండీగఢ్: వచ్చే ఏడాది జరిగే పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఢిల్లీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాలు పావులు కదుపుతున్నారు. తాజాగా, పంజాబ్లో అధికార కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్ధూపై అరవింద్ కేజ్రీవాల్ ప్రశంసలు చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ప్రజా సమస్యలపై తన గళం వినిపిస్తారంటూ సిద్ధూను కొనియాడారు.
అదే సమయంలో మాజీ, ప్రస్తుత ముఖ్యమంత్రులపై అరవింద్ కేజ్రీవాల్ విమర్శలు గుప్పించారు. అమరీందర్ సింగ్, చరణ్జిత్ సింగ్ చన్నీ నుంచి సిద్ధూ అణచివేతకు గువుతున్నారని అన్నారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా పంజాబ్లో పర్యటించారు కేజ్రీవాల్. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. 25 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలతోపాటు మరో ముగ్గురు ఎంపీలు ఆమ్ ఆద్మీ పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు.
అయితే, ఇతర పార్టీ ల నుంచి వచ్చే చెత్తను తాము చేర్చుకోబోమని కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు. సిద్ధూ ధైర్యాను తాను ప్రశసించానని, రాష్ట్రంలో ఒక క్యుబిక్ అడుగు ఇసుకను రూ. 5కే అమ్ముతున్నట్లు పంజాబ్ సీఎం చరణ్జిత్ సింగ్ చన్నీ చేసిన ప్రకటనను సిద్ధూ తప్పుబట్టారు. అది అబద్ధం.. క్యుబిక్ అడుగు ఇసుకను ఇప్పటికీ రూ. 20కే అమ్ముతున్నారంటూ సీఎం చేసిన ప్రకటనను సిద్ధూ సరిదిద్దారని కేజ్రీవాల్ తెలిపారు. అందుకే సిద్ధూను ప్రశంసించినట్లు చెప్పారు.
అంతేగాక, ప్రజా సమస్యలనే నవజోత్ సింగ్ సిద్ధు ఎప్పుడూ లేవనెత్తుతారని, కానీ, మాజీ సీఎం అమరీందర్ సింగ్, ప్రస్తుత సీఎం చన్నీ చేతిలో అణచివేతకు గురవుతున్నారని కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు. సిద్ధూ గొప్పగా పనిచేస్తున్నారంటూ కేజ్రీవాల్ కొనియాడారు. అదే సమయంలో పంజాబ్ సీఎం చన్నీపై విమర్శలు గుప్పించారు. ఉచిత కరెంట్, మొహల్లా క్లినిక్ల ఏర్పాటుపై ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమయ్యారని విమర్శించారు.
Recommended Video
కాగా, పంజాబ్లో ఆమ్ ఆద్మీ పార్టీ ముఖ్యమంత్రి ఎవరంటూ కాంగ్రెస్, బీజేపీలు ప్రశ్నించడంపై స్పందిస్తూ.. పంజాబ్ లో కాంగ్రెస్ పార్టీ కూడా తన సీఎం అభ్యర్థిని ప్రకటించలేదని, యూపీలో బీజేపీ కూడా యోగి పేరును లేదా ఇతర అభ్యర్థిని ప్రకటించలేదని చెప్పుకొచ్చారు. ఈ రెండు పార్టీల కంటే ముందే తాము సీఎం అభ్యర్థిని ప్రకటిస్తామని చెప్పారు. అయితే, పంజాబ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడైన నవజోత్ సింగ్ సిద్ధూపై కేజ్రీవాల్ ప్రశంసలు చేయడం చర్చనీయాంశంగా మారింది. అయితే, గతంలో సిద్ధూ ఆమ్ ఆద్మీ పార్టీలో చేరతారంటూ ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. కానీ, గాంధీలే తన హైకమాండ్ అని, వారి ఏం చెబితే అదే చేస్తానని సిద్ధూ ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే.